Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.24 లక్షల యంత్రానికి రూ.1.5 కోట్లు కేటాయింపు
- ఏడింటి పేర రూ.14 కోట్లు స్వాహా
- టెండర్లన్నీ ఒకే కంపెనీకి..
- జలశుద్ధీ యంత్రాల కొనుగోలుపై హెచ్ఎమ్డీఏలో భారీ అవినీతి
- మరో 6 మిషన్ల కొనుగోలు అగ్రిమెంట్కు జీహెచ్ఎంసీ రెడీ
జలశుద్ధీ యంత్రాల కొనుగోలును ఆసరాగా చేసుకుని హెచ్ఎండీఏ కోట్ల రూపాయల ప్రజాధానాన్ని కాంట్రాక్టర్లకు అప్పన్నంగా ధార పోసింది. హెచ్ఎండీఏ పరిధిలోని నదులు, చెరువుల్లో పేరుకుపోయిన చెత్త, గుర్రెపు డెక్కను తొలగించేందుకు ఫ్లోటింగ్ ట్రాష్ కలెక్టర్లను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇదే అదునుగా కాంట్రాక్టర్లతో కుమ్మకైన హెచ్ఎండీఏ అధికారులు యంత్రాల కొనుగోలుపై బహిరంగ మార్కెట్ ధర కంటే మూడింతల రెట్టింపు ధర కేటాయించి ప్రజల సొమ్ము కాంట్రాక్టర్లకు దోచి పెట్టింది. రూ. కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన యంత్రాలు కూడా నాసిరకం కావడంతో చెరువులోకి దిగిన రెండు, మూడు నెలల్లో కుప్పకూలిన పరిస్థితి నెలకొంది. దాంతో కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అవుతోంది.
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జలాశయాల్లో పేరుకుపోతున్న గుర్రెపు డెక్క, చెత్త తొలగించి.. చెరువులు, నదులను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రభుత్వం 2015లో జల శుద్ధీకరణ యంత్రాలు (ఫ్లోటింగ్ ట్రాష్ కలెక్టర్స్) కొనుగోలు చేసేందుకు హెచ్ఎండీఏకు బాధ్యతలు అప్పగించింది. దాంతో టెండర్లకు పిలవడంతో.. ఇందులో క్లీన్ టెక్ ఇన్ఫ్రా, మాట్ప్రోఫ్ టెక్నికల్ సర్వీస్ ప్రయివేట్ లిమిటెడ్, అమిన్ ఎక్యూప్మెంట్ ప్రయివేట్ లిమిటెడ్ పాల్గొన్నాయి. క్లీన్ టెక్ ఇన్ఫ్రా టెండర్ దక్కించుకోగా రూ. 4.3 కోట్లకు హెచ్ఎండీఏ అగ్రిమెంట్ చేసుకుంది. కానీ అప్పటి మార్కెట్ ధర ప్రకారం అత్యంత ఆధునిక యంత్రాన్ని కొనుగోలు చేసినప్పటికీ దాని ధర రూ. 70లక్షలు మాత్రమే. ఈ లెక్కన ఒక మిషన్పై అదనంగా రూ. 3 కోట్లు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా 2018-19 ఏడాదిలో మరో ఆరు మిషన్లు కొనుగోలు చేసేందుకు టెండర్లు పిలిచారు. ఈసారి కూడా క్లీన్ టెక్ ఇన్ఫ్రా టెండర్లు దక్కించుకోగా రూ.11.7 కోట్లకు అగ్రిమెంట్ చేసుకుంది. ఒక్కో మిషన్ కొనుగోలుకు రూ.1.50 కోట్లు కేటాయించింది. కానీ కాంట్రాక్టర్లు సప్లరు చేసిన మిషన్లు మాత్రం బహిరంగ మార్కెట్లో రూ. 24 లక్షలకే లభిస్తున్నాయి. ఈ లెక్కన ప్రభుత్వం ఒక్కో మిషన్కు రూ. 1.25కోట్లు అదనంగా చెల్లించినట్టు తెలుస్తోంది. 2015 నుంచి హెచ్ఎండీఏ పరిధిలో 7 ఫ్లోటింగ్ ట్రాష్ కలెక్టర్స్ కొనుగోలు చేసిన యంత్రాలకు ప్రస్తుత మార్కెట్ ధరను బట్టి చూస్తే మొత్తంగా రూ. 2.20కోట్లు మాత్రమే ఉంటుందని పలు ఏజెన్సీలు చెబుతున్నాయి. దీన్ని బట్టి ప్రభుత్వం కొనుగోలు చేసిన ఏడు యంత్రాలపై రూ.10 కోట్ల ప్రజాధనం అప్పన్నంగా కాంట్రాక్టర్లకు దోచిపెట్టినట్టు స్పష్టంగా అర్థం అవుతోంది.
మరో ఆరు మిషన్లు కొనుగోలుపై జీహెచ్ఎంసీ అగ్రిమెంట్లకు రెడీ
చెరువుల సుందరీకరణలో భాగంగా జీహెచ్ఎంసీ మరో ఆరు మిషన్లు కొనుగోలు చేయడానికి 2019 నుంచి నాలుగు సార్లు టెండర్లు పిలిచింది. వివిధ కారణాలతో పలుమార్లు టెండర్ల ప్రక్రియ రద్దు చేసింది. ఇటీవల నిర్వహించిన రీ టెండర్లో మరోమారు క్లీన్ టెక్ ఇన్ఫ్రా టెండర్ దక్కించుకుంది. ఇన్ని సార్లు ఒకే సంస్థకు టెండర్లు దక్కడంపై పలు అనుమానులు వ్యక్తం అవుతున్నాయి. ఆ కంపెనీతో హెచ్ఎండీఏ అధికారులు లోపాయికారి ఒప్పందం చేసుకుని, అదే కంపెనీకి టెండర్లు దక్కేలా అధికారులు వ్యవహరిస్తున్నట్టు ఇతర కంపెనీలు ఆరోపిస్తున్నాయి. ఇదే తరహాలో జీహెచ్ఎంసీ కూడా వ్యవహరిస్తోంది. ఈ మిషన్ల కొనుగోలు విషయంలో జీహెచ్ఎంసీ కూడా హెచ్ఎండీఏ నామ్స్ను ఫాలో అవుతూ ప్రజల సొమ్ము దుర్వినియోగం చేసేందుకు పూనుకుందని పలు ఏజెన్సీల ప్రతినిధులు వాపోతున్నారు. ఫ్లోటింగ్ ట్రాష్ కలెక్టర్లకు ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో ఎంత ధర ఉందన్న సమాచారం సేకరించకుండా హెచ్ఎండీఏ టెండర్స్ నామ్స్ ప్రకారం జీహెచ్ఎంసీ ఆరు యంత్రాల కొనుగోలుకు రూ. 13.33 కోట్లతో అగ్రిమెంట్ చేసుకోవడానికి ఎల్ఓఏ జారీ చేశారు. కానీ ప్రస్తుతం మార్కెట్ ఒక్కో మిషన్ మాత్రం రూ. 24 లక్షలకు లభిస్తోందని పలు ఏజెన్సీలు వివిధ కంపెనీల నుంచి తీసుకున్న కొటేషన్లు స్పష్టం చేస్తున్నాయి. చెరువుల సుందరీకరణలో భాగంగా పెద్ద మొత్తంలో రూ. కోట్ల అవినీతి జరుగుతున్నప్పటికీ ఇటు ఉన్నతాధికారులు.. అటు పాలక వర్గాలు పట్టించుకోకపోవడంతో ప్రజాధనం వృథా అవుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకుని ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.