Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు అందులో చేరగానే వ్యవసాయ నల్లచట్టాలు.. తెల్ల చట్టాలు అయ్యాయా...?
- గెలిస్తే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గిస్తారా..? : ఈటలకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూటిప్రశ్న
- మున్ముందు ఈటలతోపాటు వివేక్ కూడా కాంగ్రెస్లో చేరతారు
- దళిత బంధును ఎవ్వరూ ఆపలేరు
- నీట్పై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
బీజేపీ అనేది ఒక రొచ్చు అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. అలాంటి రొచ్చులోకి దిగిన ఈటల.. తనకు అది అంటొద్దంటే ఎలా...? అని ప్రశ్నించారు. ఆయన తమ మంత్రివర్గంలో ఉన్నప్పుడు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు, నల్లచట్టాలంటూ విమర్శించారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆయన బీజేపీలో చేరగానే ఆనల్ల చట్టాలుకాస్తా.. తెల్ల చట్టాలు అయ్యాయా..? అని ప్రశ్నించారు. హుజూరాబాద్లో బీజేపీని గెలిపిస్తే... అక్కడి ప్రజలకు ఏం చేస్తారనే విషయాన్ని ఈటల చెప్పటం లేదని అన్నారు. మిమ్మల్ని గెలిపిస్తే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించేందుకు ప్రయత్నిస్తారా..? బలహీనవర్గాల వారికి బీసీ బంధు పథకాన్ని ప్రవేశపెడతారా..? అని ఈటలను ప్రశ్నించారు. ఈనెల 25న టీఆర్ ఎస్ ప్లీనరీ నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో కేటీఆర్... విలేకర్లతో ఇష్టాగోష్టి నిర్వహించారు. తమ పార్టీ ఇరవై ఏండ్ల ప్రస్థానం, 60 లక్షల సభ్యత్వం, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ పార్టీ బలోపేతం, వివిధ కమిటీల ఏర్పాటు, హైదరాబాద్లో నిర్వహించబోయే ప్లీనరీ, నవంబరు 15న వరంగల్లో నిర్వహించతలపెట్టిన తెలంగాణ విజయ గర్జన బహిరంగ సభ తదితరాంశాలు, వాటి ఏర్పాట్ల గురించి ఆయన సుదీర్ఘంగా వివరించారు. విలేకర్లు అడిగిన వివిధ ప్రశ్నలకు ఈ సందర్భంగా సమాధానమిచ్చారు. నాగార్జున సాగర్లో సీనియర్ నేత జానారెడ్డినే తమ పార్టీ అభ్యర్థి ఓడించారని గుర్తు చేశారు. ఇప్పుడు హుజూరాబాద్లో కూడా ఈటలను ఓడిస్తామనీ, జానారెడ్డి కంటే ఈటల పెద్ద నాయకుడు కాదుగదా...? అని ప్రశ్నించారు. అక్కడ బీజేపీ.. ఈటలను, ఆయన్ను.. బీజేపీ సొంతం చేసుకోవటం లేదని అన్నారు. ఆయన తమ మంత్రివర్గంలో ఉన్నప్పుడే... దళిత బంధు పురుడు పోసుకున్నదనీ, కాకపోతే అప్పుడు దానికి సీఎం దళిత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాం అనే పేరుందని వివరించారు. అందువల్ల రాజకీయ లబ్ది కోసమే ఆ పథకాన్ని తీసుకొచ్చామని చెప్పటంలో అర్థం లేదన్నారు. హుజూరాబాద్లో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయ్యాయని కేటీఆర్ విమర్శించారు. గత పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఇదే తంతు నడిచిందని చెప్పారు. జీవన్రెడ్డి లాంటి సీనియర్ లీడర్ ఉన్న జగిత్యాలలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థికి కేవలం 7 వేల ఓట్లు మాత్రమే వచ్చాయని తెలిపారు. ఈ క్రమంలో హుజూరాబాద్లో కాంగ్రెస్ తరఫున డమ్మీ అభ్యర్థిని దింపిన పీసీసీ చీఫ్ రేవంత్... అసలు అక్కడ ప్రచారానికే వెళ్లటం లేదని అన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటలను గెలిపించి, ఆ తర్వాత ఆయన్ను కాంగ్రెస్లోకి లాక్కునేందుకు రేవంత్ ప్రణాళికలు రచిస్తున్నారని తెలిపారు. మున్ముందు ఈటలతోపాటు మాజీ ఎంపీ వివేక్ కూడా కాంగ్రెస్లోకి వెళ్లటం ఖాయమని స్పష్టం చేశారు. దళిత బంధు పథకాన్ని నవంబరు మూడు వరకే ఆపగలరనీ, ఆ తర్వాత ఎవ్వరు ఆపినా అది ఆగబోదని స్పష్టం చేశారు. ముందస్తు ఎన్నికలపై రేవంత్ రెడ్డి చిలకజోస్యం చెబుతున్నారని విమర్శించారు.
నవంబరు 15 తర్వాత తమిళనాడుకు...
ఉమ్మడి రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలుగా ఆవిర్భవించి, ఎన్నో ఒడిదుడుకులు, ఎత్తుపల్లాలను చవి చూస్తూ దశాబ్దాలపాటు నిలదొక్కుకున్నవి రెండే రెండు పార్టీలనీ, వాటిలో ఒకటి టీడీపీ కాగా, మరోటి టీఆర్ఎస్ అని కేటీఆర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో తమ పార్టీని దీర్ఘకాలంపాటు ఒక ప్రత్యామ్నాయంగా నిలబెట్టేందుకు వీలుగా డీఎమ్కే, అన్నా డీఎమ్కే పార్టీల నేతలను కలిసి, అవి అక్కడ ఎదిగిన వైనంపై అధ్యయనం చేయనున్నామని వివరించారు. ఇందుకోసం నవంబరు 15 తర్వాత తమిళనాడు వెళతామని చెప్పారు. తెలంగాణ విజయ గర్జన సభ కోసం నవంబరు 15న ఆర్టీసీ బస్సులను తమ పార్టీ వినియోగించు కోనుందనీ, అందువల్ల ఆ రోజు బస్సుల కొరత ఉంటుందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆ రోజు ప్రయాణాలన్నింటినీ వాయిదా వేసుకోవాలని కేటీఆర్... ప్రజలకు సూచించారు.
దాంట్లో నిజం లేదు...
కేసీఆర్ ఉప రాష్ట్రపతి కాబోతున్నారనే వార్తల్లో నిజం లేదని కేటీఆర్ తెలిపారు. తాను పార్టీ అధ్యక్ష్య పదవికి పోటీ చేయబోనని స్పష్టం చేశారు. విజయ గర్జన సభ అయిపోయిన తర్వాత... దాదాపు తొమ్మిది నెలలపాటు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకూ అందరికీ శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్రంలో 93 శాతం వ్యాక్సినేషన్ పూర్తయిందనీ, కరోనా ప్రభావం తగ్గటంతో తమ పార్టీ కార్యకలాపాలు ఊపందుకున్నాయని వివరించారు. నీట్ పరీక్షను రద్దు చేయాలనే అంశంపై భిన్నాభిప్రాయాలున్నాయనీ, మన విద్యార్థుల ప్రయోజనాల రీత్యా ఆలోచించి తగు నిర్ణయం తీసుకోవాల్సి ఉందని కేటీఆర్ తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు పువ్వాడ అజయకుమార్, వేముల ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్యే జీవన్రెడ్డి, ఎమ్మెల్సీ భానుప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.