Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రాల హక్కులను కాపాడాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నదీ జలాల విషయంలో కేంద్రం పెత్తనం వద్దని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. రాష్ట్రాల హక్కులను కాపాడాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టుల నిర్మాణం, నీటి వాడకం విషయంలో వస్తున్న సమస్యలను ఆధారంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం అతి జోక్యం చేసుకుంటున్నదని తెలిపారు. కృష్ణా, గోదావరి నదుల నీటి వాడకానికి గెజిట్ ద్వారా రెండు బోర్డులను ఏర్పాటు చేసి ప్రాజెక్టులు, హైడల్ విద్యుత్ను తన పరిధిలోనికి తీసుకుంటున్నదని వివరించారు. కృష్ణా, గోదావరి జలాల విషయంలో కేంద్ర ప్రభుత్వం పెత్తనం మానుకోవాలనీ, రాష్ట్రాల హక్కులను హరించొద్దనీ, కేంద్ర గెజిట్ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. బోర్డుల నిర్వాహణ ఖర్చులు, తెలుగు రాష్ట్రాలే భరించాలనీ, రెండు రాష్ట్రాలపై పెత్తనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకున్నదని ఆయన విమర్శించారు. ఇప్పటికే కృష్ణా, గోదావరి నదీ జలాలపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమలు కాలేదని తెలిపారు. నీటి పంపకానికి సంబంధించి కొత్త ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయాలని రాష్ట్రాలు కోరుతుండగా, దీనికి కేంద్ర జల వనరుల శాఖమంత్రి సైతం అంగీకరించారని గుర్తు చేశారు. ప్రస్తుతం దీనికి భిన్నంగా కేంద్ర ప్రభుత్వం బోర్డులు ఏర్పాటు చేసి ఇరు రాష్ట్రాల హక్కులను హరిస్తూ, ఫెడరల్ వ్యవస్థకు తూట్లు పొడుస్తున్నదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం గెజిట్ను ఉపసంహరించుకోవాలనీ, ఇరు రాష్ట్రాలను సమావేశపరిచి కాలపరిమితితో కూడిన నూతన ట్రిబ్యునల్ను ప్రకటించాలనీ, రాష్ట్రాల హక్కులను కాపాడేలా నదీ జలాల వినియోగాన్ని రాష్ట్రాల పరిధిలోనే ఉంచాలని డిమాండ్ చేశారు.