Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 21 నుంచి అంకురార్పణ
- 125 కిలోల బంగారంతో గర్భ గుడి గోపురం
- కేసీఆర్ కుటుంబం నుంచి కిలో 16 తులాలు
- బస్వాపురం ప్రాజెక్టు వద్ద 450 ఎకరాల్లో టూరిజం కన్వెన్షన్ : సీఎం కేసీఆర్
నవతెలంగాణ - నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
వచ్చే మార్చి28న యాదాద్రి లక్ష్మీనర్సింహాస్వామి ఆలయా న్ని పునఃప్రారంభించనున్నట్టు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. మంగళవారం ఆయన యాదాద్రిలో పర్యటించారు. అర్కిటెక్చర్ ఆనంద్ సాయి, ఈవో గీతారెడ్డితో మాట్లాడారు. అనంతరం గుట్టపై విలేకర్ల సమావేశంలో సీఎం మాట్లాడారు. చినజీయర్ స్వామి పెట్టిన ముహూర్తం ప్రకారమే ఆలయాన్ని మార్చి 28న ప్రారంభిస్తామని, మహాకుంభ సంప్రోక్షణ ఉంటుందని చెప్పారు. అదే నెల 21వ తేదీ నుంచి వైభవంగా అంకురార్పణ కార్యక్రమాలు, మహా సుదర్శన యాతం నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమాలకు వివిధ ప్రాంతాల నుంచి పీఠాధిపతులు, అమెరికా నుంచి పూజారులు కూడా వస్తారన్నారు. ఆలయానికి వచ్చే సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులూ కలుగకుండా 13 ఎకరాల్లో వసతులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. మరో 1000 ఎకరాల్లో టెంపుల్ సిటీ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఇందులో 250 కాటేజీల నిర్మాణాలు జరుగుతా యని, ఒక్కో కాటేజీ యూనిట్ రూ.2 కోట్లతో నిర్మిస్తామని తెలిపారు. స్వామి వారి గర్భగుడిపై విమాన గోపురాన్ని నిర్మించాలని నిర్ణయించినట్టు సీఎం తెలిపారు. ఇందుకోసం 125 కిలోల బంగారం అవసరమని, దీనికి రూ.65 కోట్లు ఖర్చవుతుందని అన్నారు. బంగారం, డబ్బులను రాష్ట్రంలోని అన్ని గ్రామాల ప్రజల నుంచి విరాళాల సేకరించనున్నట్టు తెలిపారు. కేసీఆర్ కుటుంబం నుంచి కిలో 16 తులాల బంగారం సమర్పిస్తున్నట్టు ప్రకటించారు. చినజీయర్ స్వామి పీఠం నుంచి కిలో, మంత్రి మల్లారెడ్డి కిలో, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కిలో బంగారం ఇస్తామన్నారన్నారు. నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్థన్రెడ్డి రెండు కిలోలు, కావేరీ సీడ్స్ తరఫున కిలో బంగారం ఇస్తామన్నారని చెప్పారు. ఆలయం వద్ద బస్టాండ్ నిర్మాణం కోసం రూ.6 కోట్ల 90 లక్షలు మంజూరు చేస్తున్నట్టు సీఎం ప్రకటించారు. దేవాలయం ప్రారంభంలోపే దీని పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గుట్ట పరిసర ప్రాంతాల్లో అండర్గ్రౌండ్, వరద నీటి కాల్వ నిర్మాణానికి అవసరమైన నిధులు కేటాయిస్తామన్నారు. రేపే జలమండలి అధికారులను పంపి ఎస్టిమేషన్ వేయిస్తామన్నారు. తమ ప్రభుత్వంలో అన్ని రకాల ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించామని, యాదాద్రి ఉద్యోగులకూ పీఆర్సీ, ఇండ్ల స్థలాలు ఇస్తామని చెప్పారు. బస్వాపురం ప్రాజెక్టు వద్ద 450 ఎకరాల్లో భూమి సేకరించి టూరి జం ప్రాజెక్టుకు అప్పగించి కన్వెన్షన్ సెంటర్ను అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయిస్తామన్నారు. దళితబంధు పథకాన్ని ఎన్నికల సంఘం ఎక్కువ కాలం ఆపలేదు.. నవంబర్ 4 నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో మంత్రులు జగదీశ్రెడ్డి, మల్లారెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి, ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, పైళ్ల శేఖర్రెడ్డి, జనార్థన్రెడ్డి, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, మాజీ ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్రెడ్డి, యాదాద్రి జెడ్పీ చైర్మెన్ సందీప్రెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మెన్ శ్రీనివాస్గుప్తా, యాదాద్రి కలెక్టర్ పమేలా సత్పతి, ఆలయ ఈవో గీతారెడ్డి, సీపీ మహేశ్ భగవత్ తదితరులు పాల్గొన్నారు.