Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఐదు జిల్లాల్లో కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ నెల 17వ తేదీ నుంచి కేసులు దాదాపు రెట్టింపయ్యాయి. కరీంనగర్లో రోజువారీ కేసుల నమోదు తొమ్మిది నుంచి 22కు, ఖమ్మంలో ఏడు నుంచి 15కు, మంచిర్యాలలో రెండు నుంచి ఏకంగా 13కు, రంగారెడ్డిలో తొమ్మిది నుంచి 17కు, వరంగల్ అర్బన్ లో మూడు నుంచి 12కు ఎగబాకాయి. అనూహ్యంగా జీహెచ్ఎంసీలో మాత్రం 55 నుంచి 38కి తగ్గాయి.
207 మందికి కరోనా
రాష్ట్రంలో కొత్తగా 207 మందికి కరోనా సోకగా, ఆ వ్యాధి నుంచి 184 మంది మాత్రమే కోలుకున్నారు. ఇద్దరు మరణించారు. శుక్రవారం సాయంత్రం 5.30 గంటల నుంచి శనివారం సాయంత్రం 5.30 గంటల వరకు 42,108 మందికి టెస్టులు చేసినట్టు కోవిడ్-19 మీడియా బులెటిన్ వెల్లడించింది. ప్రభుత్వాస్పత్రుల్లో 36,605 మందికి, ప్రయివేటు ఆస్పత్రుల్లో 5,503 మందికి పరీక్షలు నిర్వహించారు. మరో 1,595 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 3,984 యాక్టివ్ కేసులున్నాయి. జిల్లాల వారీగా చూస్తే జీహెచ్ఎంసీలో అత్యధికంగా 38 మందికి కరోనా సోకింది. అతి తక్కువగా ఐదు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ఈ వ్యాధి బారిన పడ్డారు. మరో ఆరు జిల్లాల్లో ఒక్క కేసు నమోదు కాలేదు.
18 జిల్లాల్లో పెరిగిన కేసులు
రాష్ట్రవ్యాప్తంగా చేసిన టెస్టుల్లో శుక్రవారంతో పోలిస్తే శనివారం 18 జిల్లాల్లో కేసులు పెరిగాయి. జనగామ, జోగులాంబ గద్వాల, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, మహబూబాబాద్, మంచిర్యాల, నాగర్ కర్నూల్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్ధిపేట, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో జిల్లాల్లో కేసులు పెరిగాయి.
తొమ్మిది జిల్లాల్లో తగ్గిన కేసులు
జీహెచ్ఎంసీతో సహా ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, కామారెడ్డి, మెదక్, నల్లగొండ, నిర్మల్, వనపర్తి జిల్లాల్లో తక్కువగా నమోదయ్యాయి.
ఆ జిల్లాల్లో జీరో...
నారాయణపేట జిల్లాలో నాలుగు రోజులుగా, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మూడు రోజులుగా, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో రెండు రోజులుగా ఒక్క కేసు నమోదు కాలేదు. నిజామాబాద్ లో మూడు రోజులుగా రోజుకు ఒకరు చొప్పున వ్యాధి బారిన పడుతున్నారు. మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లాలో రెండు రోజులుగా కేసుల్లో ఎలాంటి మార్పు లేదు.