Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ ఆధ్వర్యంలో సింగరేణి హెడ్ ఆఫీస్ ఎదుట ధర్నా
నవతెలంగాణ-కొత్తగూడెం
సింగరేణి గని ప్రమాదం, కరోనాతో మృతిచెందిన కార్మికుల కుటుంబాలకు రూ.15 లక్షల ప్రత్యేక ఎక్స్గ్రేషియా చెల్లించాలని సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం (సీఐటీయూ) డిమాండ్ చేసింది. ప్రమాదాల్లో వికలాంగులుగా మారిన కార్మికులకు నష్టపరిహారం ఇవ్వాలని, బాధిత కుటుంబాలకు ఉపాధి కల్పించాలని తదితర సమస్యల పరిష్కారం కోరుతూ శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. జనరల్ మేనేజర్ పర్సనల్ ఏ.ఆనంద రావుకి వినతిపత్రం సమర్పించారు. ఈ సదర్భంగా సింగరేణి కాంట్రాక్టర్ కార్మికుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.మధు, సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నరసింహారావు మాట్లాడారు. సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులు అహర్నిశలు శ్రమించి పనిచేస్తున్నారని, వారి శ్రమ ఫలితంగా కంపెనీకి కోట్లాది రూపాయల లాభాలు వస్తున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రాణం కోల్పోయిన వారికి నష్టపరిహారం చెల్లింపులో యాజమాన్యం నిర్లక్ష్యం విడనాడాలని, దిక్కుతోచని స్థితిలో ఉన్న వారి కుటుంబాలకు యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించి ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారానికి సీఐటీయూ అనేక దఫాలుగా ఆందోళనలు చేపట్టిన సందర్భంగా అధికారులు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని అన్నారు. బాధిత కుటుంబాల సమస్యలను పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించని యెడల నవంబర్ 15న జరిగే జేబీసీసీఐ సమావేశాల్లో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు యర్రగాని కృష్ణయ్య, కోశాధికారి వేల్పుల కుమారస్వామి, సీఐటీయూ నాయకులు ఎం.శ్రీను, వై.వెంకటేశ్వరరావు, జి.శ్యామ్ కుమార్, కార్మికుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.a