Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేసీఆర్, జగన్, చంద్రబాబుకు జైళ్ల భయం
- బీజేపీని దుబ్బాకలో గెలిపించింది కేసీఆరే..: సీపీఐ కార్యదర్శి నారాయణ
నవతెలంగాణ - కోదాడరూరల్
'దేశంలో రాజకీయ పిరికితనం ఆవహించింది. ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్న బీజేపీని ప్రతిపక్ష పార్టీలు ఎదురించలేకపోతున్నాయి. కేసీఆర్, జగన్, చంద్రబాబులు కేసులకు భయపడి లాలూచీ వ్యవహారం నడిపిస్తున్నారు. వాళ్లకు జైళ్ల భయం పట్టుకుంది' అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. శనివారం సూర్యాపేట జిల్లా కోదాడలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో డిపాజిట్ కూడా రాని బీజేపీని దుబ్బాక ఎనికల్లో గెలిపించింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. హుజూరాబాద్ ఎన్నికల్లో ఎవరు గెలిచినా కారణం కేసీఆర్ అని అన్నారు. రాష్ట్రంలో ప్రత్యర్థులు లేకుండా కేసీఆర్ చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, ఇందుకు ఐక్యంగా కలిసి పోరాడితేనే సాధ్యమవుతుందని చెప్పారు. రాష్ట్రంలో వరి సాగు వద్దంటే రైతుని వ్యవసాయం చేయొద్దు అనడమేనని, ఇది టీఆర్ఎస్ ప్రభుత్వ మూర్ఖత్వ నిర్ణయమని విమర్శించారు. రూ.కోట్లు ఖర్చు పెట్టి కట్టే ప్రాజెక్టులు వరి, చెరుకు, మొక్కజొన్న వంటి పెద్ద పంటల కోసమేనన్నారు. వర్షాధార పంటలు, చిరు ధాన్యాల పంటల సాగు కోసం అంత పెద్ద ప్రాజెక్టులు ఎందుకు కట్టించారని ప్రశ్నించారు. వెనిజులా, ఇరాన్ వంటి దేశాలు బియ్యం పంపిస్తే నూనె ఇస్తామని చెబుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ విధంగా ఆలోచన చేయడం లేదన్నారు. ఈ సమావేశంలో సీపీఐ సీనియర్ నాయకులు దొడ్డ నారాయణరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్న చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, కార్యవర్గ సభ్యులు మేకల శ్రీనివాస్, ధనుంజయ నాయుడు తదితరులు పాల్గొన్నారు.