Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిరిజన, స్త్రీ శిశుసంక్షేమ శాఖల మంత్రి సత్యవతి
నవతెలంగాణ-ములుగు
అర్హులైన పోడు రైతులందరికీ పట్టాలిచ్చి వ్యవసాయ భూములుగా మార్చుతామని గిరిజన, స్త్రీ శిశుసంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ములుగు జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో 'పోడు భూములు, అటవీ సంరక్షణ'పై శనివారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో మంత్రి సత్యవతి మాట్లాడారు. అడవిని సంరక్షించి భవిష్యత్ తరాలకు మంచి పర్యావరణం అందించాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పనమని చెప్పారు. పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం ఇవ్వాలనే ఇటీవల కమిటీ వేసినట్టు తెలిపారు. నవంబర్ 8 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్టు చెప్పారు. అటవీ భూములు ఎక్కువగా ఉన్న ములుగు జిల్లాలో 2006 అటవీ హక్కుల చట్టం అమల్లోకి వచ్చిందని, అనంతరం 6.90 లక్షల ఎకరాలకు సంబంధించి 2.04 లక్షల దరఖాస్తులు రాగా.. 3.08 లక్షల భూములకు సంబంధించి 96 వేల 676 దరఖాస్తులదారులకు హక్కు పత్రాలిచ్చినట్టు తెలిపారు. మిగతా వాటిని తిరస్కరించగా, 53 వేల 565 ఎకరాలకు సంబంధించిన 15 వేల 558 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని వివరించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక 68 లక్షల ఎకరాల అటవీ భూమి ఉన్నట్టు అధికారులు గుర్తించారని, 2006కు ముందే 6 లక్షల ఎకరాలకుపైగా అటవీ భూమి సాగులో ఉందని తెలిపారు. పోడు సాగుదార్లకు న్యాయం చేయడంతోపాటు అడవిని రక్షించే ఉద్దేశ్యతో సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారని చెప్పారు. ఎంపీ కవిత మాట్లాడుతూ.. అఖిలపక్ష నేతల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. పోడు భూములపై ప్రజలకు అవగాహనా కలిగించాలని కోరారు. ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. సుదీర్ఘ పోరాటాల నేపథ్యంలోనే 'దున్నే వాడిదే భూమి' నినాదం వచ్చిందన్నారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం అర్హులందరికీ పట్టాలివ్వాలని, అటవీ సంరక్షణకు సైతం బాటలు వేయాలని ఆకాంక్షించారు. జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య మాట్లాడుతూ.. అన్ని ఆవాసాలకు ఫారెస్ట్ రైట్స్ కమిటీ వేస్తామన్నారు. గ్రామ సభ ఆధ్వర్యంలో కమిటీ పని చేస్తుందని చెప్పారు. సమావేశంలో జెడ్పీ వైస్ చైర్పర్సన్ బడే నాగజ్యోతి, అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠీ, జిల్లా ఫారెస్ట్ అధికారి ఆశిష్, ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్, డీఆర్వో రమాదేవి, రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు పల్లా బుచ్చయ్య, తదితరులు పాల్గొన్నారు.