Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
కరోనా తర్వాత తిరిగి ప్రారంభమైన పాఠశాలలు, హైస్కూళ్లలో ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడాలనీ, ఆయా ప్రాంగణాల్లో పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపర్చాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి చెప్పారు. దీనికోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలనీ, అవసరమైన ఉద్యమ కార్యాచరణ రూపొందించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 'తెలంగాణ ప్రభుత్వ విద్యారంగం-సమస్యలు, పరిష్కారమార్గాలు' అంశంపై శనివారం వెబినార్ జరిగింది. దీనిలో ఆయన ప్రధాన వక్తగా మాట్లాడారు. ప్రాథమిక పాఠశాలలు మొదలు యూనివర్సిటీల వరకు అనేక ఉపాధ్యాయ, అధ్యాపక ఖాళీలు ఉన్నాయనీ, ప్రయివేటురంగాన్ని ప్రోత్సహించడం కోసమే ఖాళీలు భర్తీ చేయట్లేదనీ తెలిపారు. ప్రభుత్వం గెస్ట్ లెక్చరర్లు, అవర్లీ బేస్డ్ టీచర్లు, ఔట్సోర్సింగ్ టీచర్లకూ అనుమతి ఇవ్వట్లేదని అన్నారు. బడి బాగుచేసుకొని, టీచర్లు ఉంటే పిల్లలు వచ్చి చేరతారే తప్ప, పిల్లలు వచ్చాకే మిగిలిన పనులు చేస్తామనడం ప్రయివేటీకరణను ప్రోత్సహించడం కాక మరేంటి అని ప్రశ్నించారు. కేజీ టు పీజీ విద్య రెసిడెన్షియల్ స్కూళ్లలోనే ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు. టీఆర్ఎస్ ప్లీనరీలో కూడా గురుకులాలు పెట్టామని చెప్పారనీ, కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో గురుకులాల పరిస్థితి ఏంటనేది తెలిసొచ్చిందని ఉదహరించారు. రెసిడెన్షియల్ పాఠశాలలు ఇప్పుడే తెరుస్తున్నారనీ, కేంద్ర ప్రభుత్వ నూతన విద్యావిధానంలో ప్రయివేటీకరణకు అనుకూలంగా తెచ్చిన విధానాలనే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నదని అన్నారు. ఆన్లైన్ తరగతులు మనుగడలో లేవనీ, వాటిని విద్యార్ధులు వినట్లేదనీ, విన్నా అర్థంకావట్లేదని విశ్లేషించారు. కనీసం వారానికో రోజైనా విద్యార్ధులను స్కూళ్లకు పంపాలని కోరామని చెప్పారు. రాష్ట్రంలో 53 శాతం విద్య ప్రయివేటు రంగంలోనే చదువుకోవాల్సిన పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల సమస్యలు అంటే బదిలీలు, ప్రమోషన్లు, సర్వీస్రూల్స్ మాత్రమే కాదన్నారు. స్కూళ్లలో పారిశుద్ధ్యాన్ని పంచాయతీలు, పురపాలక సంఘాలకు ఇస్తూ, చట్ట సవరణ చేశారని చెప్పారు. ఇది సరికాదని మండలిలో చెప్పామన్నారు, అయినా దాన్ని అమలు చేసి చూపుతామనీ, అదే పరిష్కారమనీ ప్రభుత్వం చెప్తున్నదన్నారు. 1,933 పాఠశాలల్లో గూగుల్ ఫామ్ సర్వే చేసినప్పుడు కనీసం స్కూళ్లకు తాళాలు వేసేవారు కూడా లేరని చెప్పారన్నారు.14 శాతం పాఠశాలల్లో ఉపాధ్యాయులే తమ జీతంలో నుంచి కొంత చెల్లించి, పారిశుద్ధ్యం, మరుగుదొడ్లను శుభ్రపరుచుకుంటున్నారని తెలిపారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జించే వ్యాపారంగా విద్యారంగం మారిందన్నారు. దీనికి వ్యతిరేకంగా ప్రతిగ్రామంలో విద్యా ఉద్యమం రావాలనీ, ఆ దిశగా తల్లిదండ్రుల ద్వారా ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేలా ఉపాధ్యాయవర్గం కృషి చేయాలని పిలుపునిచ్చారు. రెండేండ్లలో దాదాపు 10వేల నుంచి 12వేల మంది ఉపాధ్యాయులు రిటైర్డ్ అయ్యారన్నారు. సబ్జెక్ట్ టీచర్ల కొరత లేకుండా చూడాలనీ, విద్యార్ధుల సంఖ్యను బట్టి ఉపాధ్యాయుల సంఖ్యా పెరగాలని చెప్పారు. కరోనా వల్ల ప్రయివేటు స్కూళ్లు సరిగా నడవట్లేదు కాబట్టి, ప్రభుత్వ స్కూళ్లకు పిల్లలు వస్తున్నారని డీఈఓ స్థాయి అధికారులు దుర్మార్గంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆక్షేపించారు. సమస్యల పరిష్కారం కోసం సమాజంలోని అన్ని వర్గాలనూ కలుపుకెళ్తూ ఉద్యమకార్యాచరణ చేపట్టాలని సూచించారు. నూతన జాతీయ విద్యావిధానం అంశంపై టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కె జంగయ్య మాట్లాడారు. రాష్ట్ర కార్యదర్శి జి నాగమణి వందన సమర్పణ చేశారు.