Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రం నిర్ణయంపై సీఎం ఎందుకు ఉద్యమించరు?
- ప్రజల కంటే ఎన్నికలే కేసీఆర్కు ముఖ్యం: సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
వరి పండించొద్దని చెబుతున్న ప్రభుత్వం.. వరి పండే భూముల్లో ఏం పంట వేయాలో చెప్పాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. యాదాద్రి జిల్లాలో పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట తలపెట్టిన 48 గంటల దీక్ష శనివారం ముగిసింది. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో తమ్మినేని మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్కు ప్రజల సమస్యల కంటే హూజురాబాద్ ఎన్నికలే ముఖ్యమయ్యాయని విమర్శించారు. ప్రతి పంట ఉత్పత్తిని కొనుగోలు చేస్తామన్న కేసీఆర్ ఇప్పుడెందుకు మాటమార్చారో చెప్పాలన్నారు. వరి ధాన్యం కొనుగోలు చేయొద్దని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రాలకు లేఖ పంపిందని, కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా కేసీఆర్ ఎందుకు ఉద్యమం చేయడం లేదని ప్రశ్నించారు. పేదల వ్యవసాయ భూములను స్వాధీనం చేసుకునేందుకే కార్పొరేట్ శక్తులు ఇలాంటి కుట్రలు పన్నుతున్నాయన్నారు. మోడీ ప్రభుత్వం అమెరికాకు దాసోహమై ఇక్కడి రైతులకు అన్యాయం చేస్తుందన్నారు. సీఎం కేసీఆర్ దేవుడి సేవలో పూర్తిగా మునిగిపోయారని, ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్లన్న సంగతి మరిచిపోయారని అన్నారు. యాదాద్రి జిల్లాలో ఉన్న పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం తమ పార్టీ చేస్తున్న పోరాటాలల్లో ప్రజలు పెద్దఎత్తున పాల్గొనాలని కోరారు. సమస్యల పరిష్కారం కోసం సీఎం కేసీఆర్కు లేఖ రాస్తామని తెలిపారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎమ్డి.జహంగీర్ మాట్లాడుతూ.. జిల్లాకు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు, మంత్రి ఏనాడూ పెండింగ్ సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడలేదన్నారు. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. గంధమల్ల ప్రాజెక్టు ఉందా లేదా అనే విషయాన్ని ఎమ్మెల్యే సునీత బహిరంగంగా చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టు విషయంపై నవంబర్ 10న బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని, ఎమ్మెల్యే చర్చకు సిద్దం కావాలని సవాల్ విసిరారు. బస్వాపూర్ ప్రాజెక్టు నిర్మాణం గడువు ముగిసిందని, నిధుల కొరత వల్ల పనులు నత్తనడకన సాగుతున్నాయని, వెంటనే నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. రేషన్కార్డులు, ఇండ్లు, స్థలాలు వంటి చిన్న చిన్న సమస్యలు కూడా తీర్చకపోతే పాలకులు ఎందుకున్నారని ప్రశ్నించారు. జిల్లా ఏర్పడి ఐదేండ్లు గడిచినా ఒక్క ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కాలేజీ ఏర్పాటు చేయలేదన్నారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహా, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కల్లూరి మల్లేశం, దోనూరి నర్సిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ సభలో రాష్ట్ర కమిటీ సభ్యులు పైళ్ల ఆశయ్య, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు, బట్టుపల్లి అనురాధ తదితరులు పాల్గొన్నారు.