Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలు
- తరుగు పేరుతో రైతును దగా చేస్తున్న వైనం
- మిల్లర్లు, వ్యాపారులతో సొసైటీ సీఈవోల కుమ్మక్కు
- వానాకాలంలోనూ ఎక్కువ కేంద్రాల బాధ్యత
- కలెక్టర్తో సమావేశానికి రైతుబంధు సమితి,
- రైతుసంఘాలను ఆహ్వానించాలని డిమాండ్
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
యాసంగి ధాన్యం కొనుగోళ్లలో అనేక అవతకవకలు చోటు చేసుకున్నాయి. ఆ అక్రమాల తాలూకు ఇంకా కొన్నిచోట్ల విచారణ కొనసాగుతూనే ఉంది. ఇంతలోనే వానకాలం ధాన్యం వచ్చేసింది. 'దొంగల చేతికే తాళాలు ఇచ్చినట్లు' మళ్లీ ఈ అక్రమార్కులకే ధాన్యం కొనుగోళ్ల బాధ్యతను అప్పగిస్తున్నారు. తాలుపేరుతో కోత, తూకంలో తేడా, ట్రక్షీట్ల మాయాజాలంతో రాష్ట్రవ్యాప్తంగా అక్రమాలు చోటుచేసుకున్నాయి. అధికారుల విచారణలో ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, సొసైటీల చైర్మెన్లు, సీఈవోలు, వ్యాపారులు, మిల్లర్లు మిలాఖత్ అయ్యి రూ.కోట్లలో అవినీతికి పాల్పడ్డారు. ముఖ్యంగా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్), పీఏసీఎస్ పరిధిలోని కొనుగోలు కేంద్రాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.
ఆంధ్రాలో కొనుగోలు చేసి ఇక్కడ అమ్మకం..
గత వేసవిలో వ్యాపారులు సరిహద్దు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తక్కువ ధరకు కొనుగోలు చేసిన ధాన్యాన్ని సైతం తీసుకువచ్చి జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి లాభపడినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఆ రాష్ట్రంలో క్వింటాలు ధాన్యం రూ.1,100 చొప్పున కొనుగోలు చేసి ఇక్కడ రూ.1,800 చొప్పున అమ్మినట్టు సమాచారం. డీసీఎంఎస్ల పరిధిలోని కొనుగోలు కేంద్రాల్లోనే ఈ అక్రమ వ్యవహారం నడిచినట్టు తెలుస్తోంది. సీఈవో, చైర్మెన్లు, వ్యాపారులు, మిల్లర్లతో కుమ్మక్కై రైతుల పేరుతో ఈ అక్రమాలకు పాల్పడినట్టు సమాచారం. మరోవైపు సీఈవోలు, చైర్మెన్లు మిల్లర్లు, వ్యాపారులతో మాట్లాడుకొని తరుగు పేరుతో రైతును దగా చేసి రూ.లక్షల విలువైన ధాన్యాన్ని కాజేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు, కొనుగోలు కేంద్రాలకు అవసరమైన వేయింగ్ స్కేల్స్ (ఎలక్ట్రానిక్ కాంటాలు) విషయంలోనూ డీసీఎంఎస్ పరిధిలోని కొందరు అధికారులు సంబంధిత డీలర్లతో కుమ్మక్కవుతున్నట్టు తెలుస్తోంది. గుట్టుచప్పుడు కాకుండా జిల్లాలో అవసరమైన కొనుగోలు కేంద్రాలన్నింటికీ ఎలక్ట్రానిక్ కాంటాలను ఖమ్మం మయూరిసెంటర్లోని ఓ వేయింగ్ స్కేల్స్ డీలర్ నుంచి కొనుగోలు చేసినట్టు సమాచారం. ఇందుకు గాను నాటి డీసీఎంఎస్ అధికారులకు కాంటాకు రూ.300 నుంచి రూ.500 వరకు ముడుపులు అందినట్టు తెలిసింది.
సహకార సంఘాల నిర్వాకం...
గత యాసంగి ధాన్యం కొనుగోళ్లలో సహకార సంఘాల సీఈవోలు, చైర్మెన్ల నిర్వాకం బయటపడింది. ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం సొసైటీలో ఖాళీ ట్రక్ షీట్లతో అక్రమాలకు పాల్పడిన వ్యవహారం బయటపడింది. దీనిపై విజిలెన్స్ ఎంక్వైయిరీ నిర్వహించారు. వ్యవసాయశాఖ అధికారుల రికార్డుల ప్రకారం మామిడి, సుబాబుల్, పామాయిల్ తోటలు ఉన్న భూములను కౌలుకు తీసుకుని ధాన్యం పండించినట్టుగా రికార్డులు సృష్టించారు. వీటిని అదే సొసైటీకి చెందిన డైరెక్టర్ బయటపెట్టారు. దాదాపు 20 ఖాళీ ట్రక్షీట్ల ద్వారా రూ.కోటి అవినీతి జరిగిందని అధికారులు గుర్తించారు. సొసైటీ చైర్మెన్, సీఈవో, మిల్లర్లు ఇలా మొత్తం 27 మందిపై కేసు విచారణ కొనసాగుతోంది. సత్తుపల్లి మండలం కాకర్లపల్లి, చింతకాని సొసైటీల్లోనూ ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలు వెలుగుచూశాయి.
వానాకాలం ధాన్యంలోనూ వారికే పెద్దపీట
వానాకాలం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనూ అత్యధికం పీఏసీఎస్, డీసీఎంఎస్లకే అప్పగించాలని ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్ల ప్రాథమిక అంచనాలో పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలో వానాకాలంలో 160 కేంద్రాల ద్వారా 4.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. దీనిలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్) పరిధిలో 100, డీసీఎంఎస్ ద్వారా 15, ఐకేపీ పరిధిలో 40, ఏఎంసీ ద్వారా 5 ధాన్యం కొనుగోలు కేంద్రాలను నెలకొల్పాలని నిర్ణయించారు. 160 కేంద్రాల్లో 115 కొనుగోలు కేంద్రాలు డీసీఎంఎస్, డీసీసీబీ పరిధిలోని సహకార సంఘాలకే అప్పగించడం గమనార్హం. గతేడాది వానాకాలం 324 కొనుగోలు కేంద్రాల ద్వారా 2.56 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనడం గమనార్హం. ఇప్పుడు సగానికి పైగా కొనుగోలు కేంద్రాలను తగ్గించడంపై రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
ధాన్యం కొనుగోళ్లలో లోపిస్తున్న పారదర్శకత
ధాన్యం కొనుగోళ్లలో పారదర్శకత లోపిస్తుందనే మాట సర్వత్రా వినిపిస్తోంది. దీనికి ప్రణాళికలేమి, ఉన్నతాధికారుల అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా చెబుతున్నారు. కొనుగోళ్లపై కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించే సమావేశానికి రైతుసంఘాల ప్రతినిధులు, రైతుబంధు సమితి అధ్యక్షులను ఆహ్వానించకపోవడం మరో కారణమంటున్నారు. కొంతమేరకైనా ఈ లోపాలను అధిగమించాలంటే వివిధ శాఖల అధికారులతో పాటు రైతుసంఘాలు, రైతుబంధు నాయకులనూ ఆహ్వానించాలనే డిమాండ్ వినిపిస్తోంది.
ఆరోపణలు వచ్చిన కేంద్రాలను తెరవడం లేదు
పీఏసీఎస్ల పరిధిలో 100, డీసీఎంఎస్ల ద్వారా 15 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. వీటిని పకడ్బందీగా నిర్వహించేందుకు సన్నద్ధమయ్యాం. గతంలో ఆరోపణలు వచ్చిన కేంద్రాలను ఈసారి తెరవడం లేదు.
- విజయకుమారి, జిల్లా సహకార అధికారి