Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆమె ఆచరణ సమాజ అభ్యున్నతికి అవసరం
- మూఢ నమ్మకాల నిర్మూలన చట్టసాధన సమితి
- పలు సంఘాల అభినందన
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
జస్టిస్ రాధారాణి గొప్ప మానవతావాదనీ, ఆమె ఆచరణ సమాజ అభ్యున్నతికి ఎంతో అవసరమని మూఢనమ్మకాల నిర్మూలన చట్ట సాధన సమితి నాయకులు చెప్పారు. జస్టిస్ రాధారాణి ఇటీవల హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోఆమెకు అభినందన సభను నిర్వహించారు. విజ్జానదర్శిని అధ్యక్షులు టి రమేష్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పలు సంఘాలు ఆమెకు అభినందనలు తెలిపాయి. అనంతరం రాధారాణి మాట్లాడుతూ 'నేను ఈ స్థాయికి చేరుకోవటం వెనుక నా కుటుంబ సహకారం ఎంతగానో ఉంది. మహిళల చదువుకు సహకరించటమంటే వారి పట్ల ఆ కుటుంబ ధృక్పథం చాలా గొప్పదై ఉండాలి.. ఒక జడ్జిమెంట్కు సంబధించి, దానికున్న మెరిట్ ఆధారంగానే తీర్పులు వెలువడుతాయి' అని వివరించారు. ఆయా సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో న్యాయవ్యవస్థ దేశానికి ఆశా దీపంగా కనిపిస్తున్నదన్నారు. భారత రాజ్యాంగ విలువల్ని కాపాడటం కోసం ఇటీవల పలు తీర్పులు వెలువడుతున్న తరుణంలో జస్టిస్ రాధారాణి హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందటం సంతోషదాయకమని చెప్పారు. రాష్ట్రంలో మూఢనమ్మకాలు బాగా పెరిగాయనీ, బాణామతి, చేతబడి, మంత్రాలు చేశారనే నెపంతో, అనుమానాలతో తోటి మనుషులను అమానుషంగా హత్యలు చేస్తున్న నేపథ్యంలో దీనికి పత్యేక చట్టం కావాలని చేసిన కృషిలో ఆమెతోపాటు ఆమె కుటుంబ పాత్ర గొప్పదని చెప్పారు. కుల నిర్మూలన కోసం అవిరళ కృషి చేశారని తెలిపారు. కుల పట్టింపులు, మూఢనమ్మకాల విషయంలో ఆచరణవాదిగా ఉన్నారని పలువురు కొనియాడారు.