Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిసెంబర్ 8,9 తేదీల్లో డే అండ్ నైట్ దీక్షలు
- జనవరి 8న పాలకుర్తి నుంచి పాదయాత్ర
- 21న సమ్మె నోటీస్
- గ్రామపంచాయతీ ఎంప్లాయీస్, వర్కర్స్ సమావేశం నిర్ణయం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం దశలవారీగా పోరాటాలు చేయాలని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్ నిర్ణయించింది. ఆ యూనియన్ అధ్యక్షులు పి.గణపతి రెడ్డి అధ్యక్షతన శనివారం హైదరాబాద్లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. నవంబర్ 9న సీఎంకు పోస్టు కార్డుల ఉద్యమం, డిసెంబర్ 8, 9 తేదీల్లో కలెక్టర్ కార్యాలయాల వద్ద రాత్రింబవళ్లు రెండు రోజుల పాటు దీక్షలు, జనవరి 8న రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రాతినిథ్యం వహిస్తున్న పాలకుర్తి నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర, అదే నెల మూడో వారంలో ఇందిరాపార్కు వద్ద నిరవధిక నిరాహారదీక్షలు, 21న రాష్ట్ర ప్రభుత్వానికి సమ్మె నోటీస్ అందజేయాలని సమావేశం నిర్ణయించింది. మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలనీ, సిబ్బంది వేతనాలను రూ.19,000లకు పెంచాలనీ, పని చేసే కార్మికులందరికీ ప్రభుత్వమే వేతనాలు చెల్లించాలనీ, కారోబార్, బిల్ కలెక్టర్లకు, స్పెషల్ స్టేటస్ కల్పించాలని డిమాండ్ చేసింది. ఆదివారాలు, పండుగ సెలవులు, ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేయాలని, నిర్దిష్ట పనివేళలు నిర్ణయించాలని కోరింది. పంచాయతీ కార్మికుల్లో అత్యధికులు దళితులు, పేదలున్నారని సమావేశం తెలిపింది. పీఆర్సీ కనీస వేతనం రూ.19,000 ఇవ్వాలం టూ సిఫారసు చేసినా రూ.8,500 మాత్రమే
చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. కేటగిరీలను రద్దు చేసి మల్టీపర్పస్ విధానాన్ని తీసుకొచ్చి కార్మికుల్ని వేధింపులు, తొలగింపులకు పాల్పడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేసింది. సమావేశంలో యూనియన్ గౌరవ అధ్యక్షులు పాలడుగు భాస్కర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.హెచ్.వెంకటయ్య, రాష్ట్ర ఆఫీస్ బేరర్లు ఎ.గణేష్, టి.మహేష్, పి.అప్పిరెడ్డి, ఎం.రాజలింగు, ఎం.రాజు, జి.ఈశ్వర్, రామచందర్, పులి మల్లేష్, అంజయ్య, హుస్సేన్, సదయ్య, శ్రీకాంత్ పాల్గొన్నారు.