Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అద్దె భవనాల్లో పాఠశాలలు
- వేధిస్తున్న మౌలిక వసతులు
- ఉపాధ్యాయులు సరిపడా లేక..
సెక్షన్ల తగ్గింపు
- ప్లే గ్రౌండ్ ఉన్నా.. స్పోర్ట్ కిట్స్ లేని వైనం
- పట్టించుకోని సర్కారు
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
కరోనా కారణంగా ఏడాదిన్నర కాలంగా మూతపడిన గురుకుల హాస్టళ్లు ఇటీవల తెరుచుకున్నా.. కష్టాలు మాత్రం విద్యార్థులను వెంటాడుతూనే ఉన్నాయి. పున్ణప్రారంభానికి నెల రోజుల ముందు నుంచి అన్ని హాస్టళ్లను అద్దంలా ఉంచాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చినా.. క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితులు కనిపించడం లేదు. లైట్ ఉంటే ఫ్యాన్ ఉండదు.. నల్లా నుంచి నీరు రాదు. వచ్చినా శుభ్రంగా ఉండదు. ఆహ్లాదం కోసం కాసేపు గ్రౌండ్లో ఆడుకుందామని వెళ్తే గ్రౌండ్ నిర్వహణ ఉందడు.. స్పోర్ట్స్ కిట్లు లేవు. అన్ని క్లాసులకు సరిపడా ఉపాధ్యాయులూ లేక విద్యార్థులు సతమతమవుతున్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 185 గురుకులాలుండగా.. వాటిలో మొత్తం 28,622 మంది విద్యార్థులు చదువుతున్నారు. సిద్ధిపేట జిల్లాలో 56 గురుకులాల్లో 22 కేజీబీవీలు, 16 సాంఘిక గురుకులు, 10 బీసీ గురుకులాలు, 6 మైనార్టీ గురుకులాలు, ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాల, తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ పాఠశాల ఉన్నాయి. మెదక్ జిల్లాలోని 23 గురుకులాల్లో.. 14 కస్తూర్బా విద్యాలయాలు, 04 కస్తూర్బా గురుకుల కళాశాలలు, అర్బన్ గురుకుల పాఠశాల, నాలుగు మోడల్ గురుకుల పాఠశాలలు ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలో 106 గురుకులాలుండగా.. వీటిలో బీసీ వెల్ఫేరు గురుకులాలు 35, ఎస్సీ వెల్ఫేర్ గురుకులాలు 47, సాంఘిక సంక్షేమ గురుకులాలు 12, మైనార్టీ సంక్షేమ గురుకులాలు 12 ఉన్నాయి. 30 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండాల్సింది. అయితే, సాధారణ పాఠశాలల్లో కంటే గురుకులాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ముఖ్యంగా బీసీ గురుకులాల్లో ఉపాధ్యాయుల కొరత ఎక్కువగా ఉంది. ఉపాధ్యాయుల కొరత కారణంగా పలు క్లాసుల్లో సెక్షన్లను సైతం తగ్గించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
వేధిస్తున్న అద్దె సమస్య
సంక్షేమ గురుకుల పాఠశాలలను వసతుల సమస్య వేధిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఏడేండ్లలో ఐదు వందలకు పైగా కొత్త గురుకుల పాఠశాలలను ప్రారంభించగా.. అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. అక్కడ సమస్యలను పరిష్క రించకపోవడంతో, కనీస వసతులూ లేకపోవడంతో విద్యా ర్థులు ఇబ్బందులు పడుతున్నారు. క్రమంగా తరగతులు పెరుగుతుండటంతో విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. దీంతో తొలుత తీసుకున్న భవనాల విస్తీర్ణం సరిపోక పోవడంతో తరగతుల నిర్వహణ ఇబ్బందిగా మారుతోంది.
సన్నీళ్ల స్నానమే దిక్కు..
పదిరోజుల నుంచి చలిపంజా మొదలైంది. ఈ పరిస్థితుల్లో గురుకుల హాస్టళ్లలో ఉండే పిల్లలకు స్నానాలకూ వేడినీళ్లు అందుబాటులో లేవు. చలికి వణుకుతూ తెల్లవారుజామునే పిల్లలు చల్లటి నీటితోనే స్నానం చేస్తున్నారు. వందల సంఖ్యలో పిల్లలు ఒక్క దగ్గర ఉంటున్నారని.. చలి వల్ల సులువుగా ఒకరి నుంచి మరొకరికి జలుబు వచ్చే అవకాశముంది. దీనికితోడు కరోనా మహమ్మారి భయం వెంటాడుతూనే ఉన్నది.
తీవ్ర నీటి సమస్య..
గురుకుల పాఠశాలలో సుమారు 500 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇక్కడ నీటి సమస్య తీవ్రంగా ఉంది. సింగిల్ ఫేస్ మోటర్ అర్ధ గంట నడిస్తే రెండు గంటల వరకు బంద్ చేయాలి. అప్పుడు వాటర్ స్టోరేజ్ అవుతాయి. అనంతరం మళ్లీ అర్ధగంట ఆన్ చేయాలి. పక్కనే ఉన్న మోడల్ పాఠశాలలో మిషన్ భగీరథ పైప్ లైన్ ఉంది. కానీ మా పాఠశాలలో లేదు. ఆటలు ఆడుకోవడానికి గ్రౌండ్ పెద్దగా ఉన్నా.. లెవలింగ్ చేయించలేదు. ఆర్వో వాటర్ ప్లాంట్ రిపేర్లో ఉండటంతో.. తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. కళాశాల పక్కనే డంపిండ్ యార్డు ఉంది. దీంతో దోమలు విపరీతంగా ఉన్నాయి. దుర్వాసనతో విద్యార్థులు, సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. తొలగించాలని పంచాయతీకి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు.
- మాధవి, ఎస్టీ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్- చేగుంట(మెదక్)