Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముగిసిన 'బతుకమ్మ' ఆర్డర్
- సప్పుడాగిన సిరిసిల్ల సాంచెలు
- అక్కడక్కడా తమిళనాడు చీరల తయారీ
- ఆసాములకు అరకొర ఆదాయం.. కూలీలకు గిట్టుబాటుకాని రేటు
- కార్మికుల ఖాతాల్లో జమకాని యారన్ సబ్సిడీ
- మ్యాక్స్ సొసైటీలున్నా.. ఆధిపత్యమంతా యజమానులదే!
- పది మంది చేతుల్లోనే సిరిసిల్ల వస్త్రపరిశ్రమ
- ఏటా రూ.కోట్ల బతుకమ్మ సంపదంతా వారి జేబుల్లోకే..
'బతుకమ్మ చీరలు, ఇతర ప్రభుత్వ ఆర్డర్లు ఉన్న మూన్నాన్నెళ్లు మాత్రమే సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ పచ్చగా కనిపిస్తోంది. మిగతా 8 నెలలూ అరకొర పనితో పస్తులే ఉంటోంది. ఆ మూన్నాన్నెళ్ల ఆర్డర్లు అయినా ఏడాది పొడువునా కడుపు నింపుతాయంటే.. చేసిన పనికి తగిన ఆదాయం, కూలి గిట్టుబాటుకాక ఆసాములు, కార్మికులు నిస్సహాయంగా మారుతున్నారు. రూ.కోట్ల విలువజేసే బతుకమ్మ ఆర్డర్లు మ్యాక్స్సొసైటీల పేరుతో వచ్చినా.. వాటిపై గుత్తాధిపత్యం ఉన్న పది మంది యజమానుల జేబుల్లోకే లాభాలు చేరుతున్నాయి. ఉరిసిల్ల సిరిసిల్లగా మారింది అని సర్కారు చెబుతున్నా.. ఈ నెల వ్యవధిలోనే ముగ్గురు కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితులపై నవతెలంగాణ ప్రత్యేక కథనమిది.
సిరిసిల్ల నుంచి బండోజు శ్రీకాంత్
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమల్లో 27,500 మరమగ్గాలు ఉండగా.. అందులో 24,500 సాంచెలపై పాలిస్టర్, మరో 3వేల మగ్గాలపై కాటన్ ఉత్పత్తి అవుతోంది. నాలుగేండ్లకుపైగా కాటన్ వస్త్ర ఉ్పత్తత్తి పూర్తిగా నిలిచిపోగా.. ప్రస్తుతం అక్కడక్కడ మాత్రమే మగ్గాలపై కనిపిస్తోంది. పాలిస్టర్కు మార్కెట్లో ధర లేక యజమానులు కూడా ఆ వస్త్రం ఉత్పత్తి వైపు పెద్దగా మొగ్గుచూపడం లేదు. ఐదేండ్ల కిందటి నుంచే పాలిస్టర్ ఉత్పత్తి లేక సంక్షోభంలో కూరుకుపోతున్న పరిశ్రమకు ప్రభుత్వం బతుకమ్మ చీరల ఆర్డర్లతో కొంత ఊపిరి పోసింది. సర్వశిక్షఅభియాన్, రంజాన్, క్రిస్మస్, కేసీఆర్ కిట్ స్కీముల్లోని వస్త్రాల ఆర్డర్లతో ఉపశమనాన్ని కలిగిస్తోంది.
2017 నుంచి మొదలైన బతుకమ్మ ఆర్డర్లతో ఏడాదిలో మూన్నాన్నెళ్లే ఉపాధి ఉంటుంది. దాంతో కూడా ఆసాములు, కార్మికులకు అరకొర ఆదాయమే వస్తోంది. మీటరు చీర నేసినందుకు ప్రభుత్వం రూ.33 ఇస్తుండగా.. అందులో యజమాని రూ.10.50మాత్రమే ఆసామికి చెల్లిస్తున్నాడు. ఆసామి తనకొచ్చే కూలిలో సగం కార్మికునికి ఇవ్వగా.. మిగిలిన సగం మరమగ్గాల నిర్వహణకే సరిపోతోంది. మరోవైపు రెండేండ్లుగా బతుకమ్మ చీరల డిజైన్లలో ప్రభుత్వం మార్పులు తీసుకొచ్చింది. దీంతో పెరిగిన చీర డిజైన్ను నేసేందుకు అదనంగా మగ్గానికి పింజర్లతో కూడిన డాబీలను ఏర్పాటు చేయాల్సి వచ్చింది. వాటికి అదనంగా రూ.20వేల చొప్పున ఆసామికి గతేడాదే భారం పడింది. దీంతో బతుకమ్మ చీరలు నేయలేమని సమ్మెకు దిగిన నేపథ్యంలో ప్రభుత్వం అదనంగా ఖర్చయిన డాబీలకు సబ్సిడీ రూపంలో రూ.15వేల చొప్పున రూ.30కోట్ల మేర చెల్లిస్తామని చెప్పి మాట మరిచింది.
తీవ్ర నష్టం
పరిశ్రమలోని 6750 మంది ఆసాములకు బతుకమ్మ చీరల ఆర్డర్లు కనీసం ఆదాయాన్ని తెచ్చిపెట్టకపోగా తీవ్ర నష్టాన్నే మిగిల్చాయి. సాధారణంగా 8మగ్గాలు నడిచే కార్మికులు సైతం పెరిగిన డిజైన్లతో 4మగ్గాలకంటే ఎక్కువ నడకపలేకపోవడంతో సరిపడా కూలి గిట్టుబాటు కాలేదు. అందులోనూ నాలుగేండ్ల కిందట ప్రకటించిన బతుకమ్మ ఆర్డర్ల యారన్పై 10శాతం సబ్సిడీ కార్మికుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పిన ప్రభుత్వం 2018లో 3250 మంది ఖాతాల్లో రూ.5.75కోట్లు చెల్లించింది. 2019 నుంచి ఏడాదికి సుమారు రూ.9కోట్ల మేర సబ్సిడీ మొత్తాన్ని మూడేండ్లుగా చెల్లించడం లేదు. ఇదిలా ఉంటే, ఇటీవలి భారీ వర్షాలకు పరిశ్రమలోని అనేక కార్ఖానాల్లో మరమగ్గాలు పెద్దఎత్తున దెబ్బతిన్నాయి. చేనేత, జౌళిశాఖ అధికారుల సర్వే చేసిన ప్రకారం 137 కార్ఖానాల్లోని 1516 మరగ్గాలు దెబ్బతిని సుమారు రూ.37లక్షల మేర నష్టం వాటిల్లినట్టు తేల్చడం గమనార్హం.
రూ.కోట్లకు పడగలెత్తిన యజమానులు
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ పది మంది యజమానుల చేతుల్లో బందీ అయింది. 10లోపు సాంచెలు ఉన్న ఆసాములు 12మంది కలిసి ఏర్పడిన మ్యాక్స్(మ్యూచువల్ ఎయిడెంట్ కో ఆపరేటీవ్ సొసైటీ) సంఘాలు సుమారు 150వరకు ఉన్నాయి. వీరు ప్రభుత్వం ఇచ్చే ఆర్డర్లకుగానీ, సొంతంగా వస్త్రం నేసేందుకు కావాల్సిన యారన్పై పెట్టుబడి పెట్టలేక ఆ పది మంది యజమానులపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఇలా ఒక్కో యజమాని గుప్పిట్లోనే సుమారు 20 నుంచి 30 సంఘాలు ఉన్నాయి. అయితే, సర్కారు ఆర్డర్లు సొసైటీ పేరు మీదనే ఇచ్చినా పెట్టుబడి పెట్టే యజమానులు ఆసాములు, కార్మికులకు అరకొర కూలి ఇస్తూ మిగతాది కాజేస్తున్నారు. ఏడాదిలో సరిగ్గా మూన్నాన్నెళ్లు మాత్రమే నడిచే పరిశ్రమపై అన్ని ఖర్చులూ పోను ఒక్కో యజమాని రూ.3కోట్ల నుంచి రూ.4కోట్లమేర లాభాలు ఆర్జిస్తున్నాడు. 'బతుకమ్మ సంపద' మొదలైనప్పటి నుంచి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో పేరుమోసిన బడా యజమానుల్లో కొందరు రెండెండ్లలో పెద్దఎత్తునే పోగేసుకున్నారు. కార్మికులకు మాత్రం ఆ మూన్నాన్నెళ్ల తర్వాత ఉపాధి కరువవుతోంది. అక్కడక్కడా తమిళనాడు చీరలు నేస్తున్నారు.
ఐదేండ్లలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకిచ్చిన 'బతుకమ్మ' చీరల ఆర్డర్లు
2017 రూ.280కోట్లు
2018 రూ.300కోట్లు
2019 రూ.320కోట్లు
2020 రూ.325కోట్లు
2021 రూ.338కోట్లు