Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోఆపరేటివ్ స్టాల్స్ ద్వారా తక్కువ ధరకు సరఫరా
- అందరికీ రూ.15కే కిలో బియ్యం
- ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో 'సుభిక్ష హౌటళ్లు'
- కరోనా సమయంలో 13 రకాల సరుకుల కిట్లు పంచాం
- 'ప్రజాపక్షం' వార్షికోవత్సంలో కేరళ మంత్రి అనిల్ వెల్లడి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
పెరుగుతున్న నిత్యావసర ధరలకు కళ్లెం వేసేందుకు తమ రాష్ట్ర ప్రభుత్వం 'కోఆపరేటివ్ స్టాల్స్' ఏర్పాటు చేసిందనీ, వాటి ద్వారా తక్కువ ధరలకే నిత్యావసర వస్తువులను సరఫరా చేస్తున్నామని కేరళ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి జిఆర్ అనిల్ తెలిపారు.2016 నుంచి 13 రకాల వస్తువులకు ధరలను పెంచకుండా అందిస్తున్నామని వివరించారు. మందులు, పెట్రోల్, ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా సరఫరా చేస్తున్నామని తెలిపారు. నోడల్ వ్యవస్థ ద్వారా బహిరంగ మార్కెట్ నుంచి వడ్లను సేకరించి, బియ్యంగా మార్చి సబ్సిడీతో రూ 15కే కిలో బియ్యాన్ని పంపిణీ చేస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదనే లక్ష్యంతో 'సుభిక్ష హౌటళ్ల'ను ఏర్పాటు చేశామన్నారు.ప్రజాపక్షం దినపత్రిక మూడోవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని నాగోల్ గిరిప్రసాద్భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో 'ప్రజా పంపిణీ వ్యవస్థ- కేరళ తరహా' అనే అంశంపై మంత్రి అనిల్ ప్రసంగించారు.
కేరళలో ఐదు రకాల రేషన్ కార్డులు ఉన్నాయనీ, ఇందులో మూడు రకాల కార్డులకు ఉచిత రేషన్, మరో రెండు రకాల కార్డులకు ప్రభుత్వ సబ్సిడీలతో తక్కువ ధరలకే నిత్యావసర వస్తువులను అందిస్తున్నట్టు తెలిపారు.ఆకలితో ఏ ఒక్కరూ మరణించ కూడదనీ, నిత్యావసరాలు అందకుండా ఇబ్బందులు పడకూడదని ఆయన అన్నారు. ఇందు కోసం తాము ఎన్నో చర్యలు తీసుకున్నామన్నారు. కోవిడ్ సంక్షోభ కాలంలో, వరదల సమయంలో ఏ ఒక్కరూ ఆకలితో చనిపోలేదని చెప్పారు. తమ రాష్ట్రంలో 42.65 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం ఉండగా, కేంద్ర ప్రభుత్వం కేవలం 14.25 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కేటాయించిందన్నారు. అందులో 10.26 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కేవలం దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికి సరిపోతాయని వివరించారు. కేంద్రం అందజేసే బియ్యం కేవలం 43 శాతం సరఫరా కాగా, 57 శాతం మంది రేషన్ బియ్యం అందుకోలేని పరిస్థితి ఉందని చెప్పారు. కేరళ రాష్ట్రంలో 91,42,191 రేషన్ కార్డులు ఉన్నాయనీ, ప్రతి కిమీకు ఒకటి చొప్పున మొత్తం 14వేల చౌక ధరల దుకాణాలు ఉన్నాయని గుర్తు చేశారు. 2020-21లో 7.6 లక్షల మెట్రిక్ టన్నుల వడ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ 201.7 కోట్లు చెల్లించిందని చెప్పారు. కరోనా కష్టకాలంలో ఎలాంటి పరిమితి విధించకుండా 13 రకాల ఉచిత ఆహార కిట్లను సరఫరా చేశామని ఈ సందర్భంగా మంత్రి అనిల్ చెప్పారు. ఈ విషయాన్ని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు జీర్ణించుకోలేకపోయాయని విమర్శించారు. వలస కార్మికులకు కూడా ఉచితంగానే కిట్లు అందజేశామన్నారు. కరోనా, వరదల కష్ట కాలాన్ని ఎందుర్కొనేందుకు రెండేండ్లలో రూ6వేల కోట్లను ఖర్చు చేశామనీ, ఇది కేరళ సాధించిన ఘనత అని చెప్పారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి మాట్లాడుతూ ప్రజల కోసం, ప్రజల మధ్య పనిచేస్తే బలోపేతవుతామనేందుకు కేరళలోని వామపక్ష ప్రభుత్వమే నిదర్శనమన్నారు. అక్కడి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలమేరకు పనిచేస్తున్నదని చెప్పారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కేరళ పంచాయతీరాజ్ వ్యవస్థను పరిశీలించానని గుర్తు చేశారు. ఈ కార్యక్రమానికి నవచేతన విజ్ఞాన సమితి అధ్యక్షులు పల్లా వెంకట్ రెడ్డి అధ్యక్షత వహించారు. సంపాదకులు కె.శ్రీనివాస్రెడ్డి, పాత్రికేయులు కె.విరాహత్, బొమ్మగాని కిరణ్, ఎస్.శంకర్గౌడ్ తదితరులు మంత్రి అనిల్ను సన్మానించారు. కవి, రచయిత భూతం ముత్యాలు జ్ఞాపికను బహుకరించారు. అంతకు ముందు సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్ధూంభవన్లో జరిగిన విలేకర్ల సమావేశంలోనూ మంత్రి కేరళ అనుసరిస్తున్న వివిధ ప్రజానుకూల విధానాలను వివరించారు. ఈ సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పాల్గొన్నారు.
సామాన్యులు పోటీ చేసే అవకాశం లేదు : చాడ
ఎన్నికల్లో సామాన్యులు పోటీ చేసే అవకాశం లేదనీ, కోటీశ్వరులు మాత్రమే బరిలో దిగే దుస్థితి దాపురించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక జరిగిన తీరుపై ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పోటాపోటీగా సాగిన ఇలాంటి ఎన్నికలతో ప్రజాసేవకులు కనుమరుగవుతారని పేర్కొన్నారు. డబ్బు, మద్యం, గంజాయి పంపకాలతో వేలకోట్ల రూపాయల ఎన్నికగా ఇది మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.