Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమస్యల వలయంలో ప్రజలు
- మోడీ, కేసీఆర్ బూటకపు మాటలు ఇక చెల్లవ్
- వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించే ప్రయత్నాలు
- కేంద్ర ప్రభుత్వ విధానాలను బలపర్చుతున్న టీఆర్ఎస్
- దళిత బంధు.. ఎన్నికల బంధుగా మారింది
- సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా 9వ మహాసభలో తమ్మినేని
నవతెలంగాణ - రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
మోడీ ఏడేండ్ల పాలనలో కార్పొరేట్ శక్తుల బలోపేతానికే కృషి చేశారని, కర్షక, కార్మికుల హక్కులను తొక్కేశారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ప్రధాని మోడీ, రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలో ప్రజలు సమస్యల
వలయంలో చిక్కుకున్నారని, వారిని సమస్యల నుంచి గట్టెక్కించేది కమ్యూనిస్టులేనని స్పష్టం చేశారు. మోడీ పాలనలో నిరుద్యోగ, కార్మిక, కర్షకులకు నిరాశే మిగలడంతో మోడీపై వ్యతిరేక పవనాలు వీస్తున్నాయన్నారు. రాష్ట్రంలో తెలంగాణ సెంట్మెంట్తో ఎన్నికల్లో విజయం సాధించిన సీఎం కేసీఆర్ గ్రాఫ్ తగ్గుముఖం పట్టిందన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా షాద్నగర్లోని మస్కు నర్సింహ్మ ప్రాంగణం, బడ్డు నర్సింహ్మ, కుర్మయ్యనగర్లో సీపీఐ(ఎం) జిల్లా 9వ మహాసభను పార్టీ నాయకులు పగడాల యాదయ్య, కడిగళ్ల భాస్కర్, కవిత అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో తమ్మినేని మాట్లాడారు.
దేశంలో మోడీ పాలన 'కాకులను కొట్టి.. గద్దలకు వేసిన' తీరున ఉందని విమర్శించారు. ఏడున్నారేండ్ల కాలంలో కార్పొరేటు శక్తుల బలోపేతం కోసం కృషి చేస్తూ.. పేద, బడుగు బలహీన వర్గాల హక్కులను తొక్కేస్తున్నారన్నారు. వ్యవసాయ రంగంపై కార్పొరేటు శక్తుల కన్ను పడటంతో మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను తెచ్చిందన్నారు. కార్పొరేటు శక్తుల మోచేతి నీళ్లుతాగే పాలకవర్గాలు రైతులను కూలీలుగా మార్చేందుకు కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు. అమెరికా సామ్రాజ్యవాద శక్తుల ఒప్పందాల మేరకే దేశంలో రైతులు వరి పంట వేయకుండా పాలక వర్గాలు యత్నిస్తున్నాయన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను తీసుకువస్తున్న బీజేపీకి టీఆర్ఎస్ ప్రభుత్వం మద్దతు ఇస్తూనే.. రాష్ట్ర ప్రజలను మోసం చేసేందుకు ఇక్కడ దొంగ నాటకం ఆడుతోందన్నారు. ఇందుకు నిదర్శనం నెల రోజుల కింద కేంద్రం నుంచి వరి ధాన్యం కొనుగోలు చేయొద్దని లేఖ వస్తే.. బీజేపీ విధానంపై ఉద్యమించాల్సిన టీఆర్ఎస్.. ఆ పని చేయకుండా.. వరి ధాన్యం కొనుగోలు చేయబోమని ప్రకటనలు చేసిందన్నారు. సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ఎన్నికల బంధుగా మార్చాడని అన్నారు. దళితబంధు పథకంపై అఖిపక్ష నిర్ణయాన్ని తుంగలో తొక్కి తమ సొంత నిర్ణయాలను తమ రాజకీయ లబ్ది కోసం ఉపయోగిస్తున్నారని విమర్శించారు. కార్మికులను, కర్షకులను, నిరుద్యోగులను ఐక్యం చేసి భవిష్యత్లో ప్రజా ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల సమస్యల పరిష్కార ఉద్యమాలకు మహాసభలు దిశ-నిర్దేశంగా ఉండాలన్నారు. ప్రజా అవసరాల కోసం పార్టీ నాయకత్వం ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ మహాసభలో కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.వెంకట్, రాష్ట్ర నాయకులు జంగారెడ్డి, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి భూపాల్, సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కార్యదర్శి దుబ్బాక రాంచందర్, నాయకులు ప్రతినిధులు పాల్గొన్నారు.