Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హుజూరాబాద్లో 86.33 శాతం ఓటింగ్
- ముగిసిన ఉపపోరు
- చెదురుమదురు ఘటనల మధ్య పోలింగ్ ప్రశాంతం
- 2018కంటే 2శాతం అధిక ఓటింగ్
- ఈవీఎంలలో భద్రమైన అభ్యర్థుల భవితవ్యం
- నవంబర్ 2న ఓట్లు లెక్కింపు
- డబ్బు పంపిణీ, ఇతర ప్రలోభాలపై ఈసీకి 88 ఫిర్యాదులు
- విచారణలో నిజాలు తేలితే చర్యలు : సీఈఓ శశాంక్ గోయల్
- పోటాపోటీగానే ఇరువురికి ఓట్లు పడినట్టు పలు సర్వేల వెల్లడి
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి / హుజూరాబాద్
చెదురుమదురు ఘటనలు మినహా హుజూరాబాద్ ఉప ఎన్నికల పోలింగ్ శనివారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 7గంటలవరకు సుమారు 12 గంటల పాటు సాగిన పోలింగ్ 86.33శాతంగా నమోదైంది. సాయంత్రం 5గంటల వరకు 76.26శాతం పోలింగ్ నమోదు కాగా.. ఆయా కేంద్రాల్లో క్యూలో ఉన్నవారికి ఓటు వేసేవరకూ అధికారులు అనుమతిచ్చారు. ఆ రెండు గంటల వ్యవధిలోనే 8శాతం ఓటింగ్ నమోదైంది. 2018 ఎన్నికల్లో నమోదైన 84.5శాతంతో పోల్చితే 2శాతం పెరిగింది. ఐదు నెలలుగా సాగిన హుజూరాబాద్ ఉప పోరులో అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో భద్రం కాగా.. నవంబర్2న ఓట్ల లెక్కింపులో ఫలితం తేలనుంది.
అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు
వీణవంక మండలం హిమ్మత్నగర్లో ఉదయం కొంత ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీజేపీ నాయకురాలు, కరీంనగర్ జడ్పీ మాజీ చైర్మెన్ తుల ఉమ ప్రచారం చేస్తుందంటూ టీఆర్ఎస్ నాయకులు వాగ్వివాదానికి దిగారు. కొంతసేపు తోపులాట జరగ్గా పోలీసుల రాకతో సద్దుమనిగింది. తుల ఉమ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇదే మండలంలోని చల్లూరులో మార్కెట్ చైర్మెన్ బాలకిషన్రావు ఇంట్లో డబ్బులు పంచుతున్నారని బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఈ ఘటనలోనూ ఇరు పార్టీల మధ్య ఘర్షణ తలెత్తింది. జమ్మికుంటలోని 28వార్డులో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీఆర్ఎస్ కౌన్సిలర్ దీప్తి ఇంట్లో డబ్బులు పంచుతున్నారని ఈటల అనుచరులు ఆందోళనకు దిగారు. వీణవంక మండలం కోర్కల్లోనూ ఘర్షణ తలెత్తింది. పోలింగ్ కేంద్రం వద్ద సర్పంచ్ ప్రచారం చేస్తున్నారని గొడవ మొదలవడంతో పోలీసులు ప్రవేశించి ఇరువర్గాలను చెదరగొట్టారు. హుజూరాబాద్ మండలం శ్రీరాములపల్లిలోనూ గజ్వేల్ మార్కెట్ చైర్మెన్ మాదాసు శ్రీనివాస్ను ఈటల వర్గీయులు ఘెరావ్ చేశారు. స్థానికేతరులు ఎందుకు వచ్చారని ప్రశ్నించడంతో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు.
కలెక్టర్, సీపీ వేర్వేరుగా పరిశీలన
కరీంనగర్ కలెక్టర్ ఆర్వీ కర్ణన్, పోలీసు కమిషనర్ సత్యనారాయణ వేర్వేరుగా పోలింగ్ సరళిని పరిశీలించారు. వీణవంకలోని కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ పోలింగ్ సరళి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉప ఎన్నికలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ చోటుచేసుకోకుండా పూర్తి అప్రమత్తతో పోలీసుశాఖ పని చేసిందని సీపీ సత్యనారాయణ తెలిపారు. పోలింగ్ సమయంలో సామాజిక మాధ్యమాల్లో అసత్యాలు ప్రచారం చేశారని, తప్పుడు వార్తలూ వచ్చాయని చెప్పిన సీపీ.. మీడియా వేదికగా వాటిని నమ్మొద్దని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారం కోసం బయటి ప్రాంతాల నుంచి వచ్చిన నేతలను ఉదయంలోపే నియోజకవర్గం నుంచి పంపించినట్టు తెలిపారు.
ఫిర్యాదులు అందాయి.. డబ్బు పంపిణీపై ప్రత్యేక దృష్టి
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్
హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో తమకు 88 ఫిర్యాదులు వచ్చాయని రాష్ట్ర ఎన్నికల ప్రనధాన అధికారి (సీఈఓ) శశాంక్ గోయల్ తెలిపారు. హుజూరాబాద్లోని పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఆయన 306 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని తెలిపారు. ఇప్పటివరకు వచ్చిన 88 ఫిర్యాదులపై ఎన్నికల పరిశీలకులు వివరాలు సేకరిస్తున్నారని తెలిపారు. డబ్బు పంపిణీపై ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామని చెప్పారు. ఓటర్లను ప్రలోభపెట్టే పనులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. డబ్బుల పంపిణీ ఆరోపణలపై ఎప్పటికప్పుడూ విచారణ జరుపుతామన్నారు. ఇదే సమయంలో తప్పుడు వార్తలు వ్యాప్తి చేసిన వారిపైనా దృష్టిసారించామన్నారు. ఈటల రాజేందర్ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని కేంద్ర ఎన్నికల సంఘానికి టీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఈటల రాజేందర్ మీడియాలో వ్యాఖ్యలు చేశారని, అసత్యపు ఆరోపణలు చేశారని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు.
సీల్డ్ కవర్లతో మొదలైన రచ్చ..
ప్రచారం ముగిసిన బుధవారం రాత్రి నుంచే ప్రలోభాలకు తెరతీసిన పార్టీలు నగదు, మద్యం పంపిణీతో రచ్చ చేశాయి. ఏకంగా సీల్డ్ కవర్లు ప్యాక్ చేసి మరీ రూ.6వేల నుంచి రూ.10వేల నగదు వరకు పంచుతున్నారన్న వార్త.. ఆ నోటా ఈ నోటా నానుతూ రెండ్రోజుల్లో రచ్చ తారాస్థాయికి చేరింది. కనీవినీ ఎరుగని రీతిలో.. డబ్బులు అందని ఓటర్లు ఏకంగా రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది. స్థానిక నాయకులు, సర్పంచులు, కౌన్సిలర్ల ఇంటి ఎదుట ఆందోళనలు, దాడి చేసేవరకూ వెళ్లింది. ఈ పరిణామాల మధ్య శుక్రవారం రాత్రి నుంచి పోలింగ్ జరిగిన శనివారం ఉదయం వరకూ నోట్ల పంపిణీ మళ్లీ చేసేలా చేసింది. హుజూరాబాద్ పట్టణంలోని ఐదో వార్డులో ఓ పార్టీకి చెందిన స్థానిక లీడర్ ఓటర్లకు డబ్బు పంపిణీ చేశాడు. చేతుల్లో లిస్టులు పెట్టుకుని మరీ ఇంటింటికీ తిరుగుతూ ఓటుకింతా పంపకాలు చేపట్టిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఇలాంటి ఘటనలు పలు మండలాల్లోనూ చోటుచేసుకోగా, కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో రచ్చచేశాయి. అయితే కొందరికి ఓటుకు రూ.1500 చొప్పున ఇవ్వగా.. మరికొందరికి రూ.500 మాత్రమే ఇచ్చారు. అంతాబాగానే ఉందని చేతులు దులుపుకునేలోపు పలువురు ఓటర్లు వారిని నిలదీశారు. 'ఇస్తే అందరికీ ఇవ్వాలే.
లేదంటే ఇవ్వకూడదు. మాకు ఒక్క రూపాయి కూడా అందలేదు' అంటూ కొందరు తీవ్రస్థాయి అక్కసు వెళ్లగక్కారు. మొత్తంగా ఓట్ల కోసం డబ్బులు పంచుతుంటే వాళ్లను పట్టుకుని పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిందిపోయి.. ఓటుకు డబ్బులు అందలేదని ఓటర్లు రోడ్డెక్కడమే సర్వత్రా ఆసక్తి రేపింది.