Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వం ఇచ్చిన జాగాలో 'డబుల్' ఇండ్లు మంజూరు చేయాలి
- మంచినీటి వసతులు కల్పించండి
నవతెలంగాణ- పాన్గల్
ప్రభుత్వం ఇచ్చిన జాగాలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని గిరిజనులు డిమాండ్ చేస్తూ ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించారు. అక్కడికి వచ్చిన మంత్రి నిరంజన్రెడ్డిని, జిల్లా కలెక్టర్ షేక్ అశ్విని భాషను నిలదీశారు. ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ ఆఫీస్లో పోడు భూములు సమస్యలపై ఏర్పాటుచేసిన సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి హాజరయ్యారు. విషయం తెలుసుకున్న వనపర్తి ఆదివాసీలు, గిరిజనులు ఆర్టీఓ కార్యాలయానికి తరలివచ్చి మంత్రిని అడ్డుకొని తమ సమస్యలపై నిలదీశారు. 30 ఏండ్ల కిందట వనపర్తి జిల్లా కేంద్రం పక్కనున్న రాజా గారి సంస్థ నాగవరం శివారులో ఏర్పాటుచేసిన జాగాల్లో గుడిసెలు వేసుకొని ఉంటున్నామని తెలిపారు. కానీ నేటికీ మంచినీటి వసతి లేదన్నారు. ఆ జాగాల్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని మంత్రిని నిలదీశారు. స్పందించిన మంత్రి.. మంచినీటి వసతితో పాటు ఇండ్లు మంజూరు చేస్తామని గిరిజనులకు హామీ ఇచ్చారు. అనంతరం గిరిజన సంఘం ఆధ్వర్యంలో మంత్రికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో తెలంగాణ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు బాల్య నాయక్, చెంచు ఆదివాసులు బాధ్యులు జగదీశ్వర్, లింగమ్మ, సువాసిని, తదితరులు పాల్గొన్నారు.