Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రాజెక్టుల పేరుతో కమీషన్లు : వైఎస్సార్ షర్మిల
- మాల్ మార్కెట్లో బహిరంగ సభ
నవతెలంగాణ-యాచారం
రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల పేరుతో సీఎం కేసీఆర్ లక్షల కోట్ల రూపాయలు కమీషన్లు తీసుకుని పేద ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా యాచారం మండల పరిధిలోని మొండిగౌరెల్లి, చింతపట్ల నల్లవెల్లిల్లో వైఎస్సార్ తెలంగాణ పార్టీ ప్రజా ప్రస్థానం పాదయాత్ర కొనసాగింది. అనంతరం మాల్ మార్కెట్ ఎదుట బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. నీళ్లు, నిధులు, ఉద్యోగాలు కోసం తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పాలన గడీలకే పరిమితమైందని విమర్శించారు. కేసీఆర్ కుటుంబ పాలనకు ప్రజలంతా చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మిగులు బడ్జెట్ ఉన్న.. రూ.లక్ష వేల కోట్లు అప్పు చేశారని తెలిపారు. రాష్ట్రాన్ని పూర్తిగా బీర్లు, బార్ల తెలంగాణగా మార్చారన్నారు. రైతుబంధు పేరుతో ఇచ్చేది గోరంత.. లాగేది కొండంత.. అన్న చందంగా ఉందని అన్నారు. రాష్ట్రంలో లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా ఒక్క నోటిఫికేషన్ కూడా వేయడం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్టీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.