Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెరుగుతున్న ధరలకు నిరసనగా ఈ నెల 14 నుంచి పాదయాత్రలు:కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్
నవతెలంగాణ- మహబూబ్నగర్
తెలంగాణలో ప్రజాధనాన్ని కేసీఆర్ కుటుంబం లూటీ చేస్తుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్కం ఠాగూర్ ఆరోపించారు. ఆదివారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని క్రౌన్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో మహబూబ్నగర్ పార్లమెంట్ స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజల నుంచి వచ్చిన ధనాన్ని వారి కుటుంబ అభివద్ధి కోసం అక్రమార్జన చేస్తున్నారని వారు ఆరోపించారు. ప్రతి కాంటాక్టు కమిషన్ పనులు చేసుకుంటున్నారని తెలిపారు. దాంతో వారి కుటుంబ నాయకులు తప్ప మిగతా వారు ఎవరు కూడా ప్రజలకు సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కలిసి ధరలను అదుపు చేయకుండా ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తున్నారని విమర్శించారు. పెరుగుతున్న ధరలకు నిరసనగా ఈ నెల 14 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ పాదయాత్ర చేపడుతున్నట్టు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నవంబర్ 28న నాగర్కర్నూల్ పార్లమెంట్ స్థాయి సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఓబేదుల్ల కొత్వాల్, ఏఐసీసీ కార్యదర్శి వంశీచందర్ రెడ్డి, చిన్నారెడ్డి, సంపత్ కుమార్, పీసీసీ కార్యదర్శులు ఎంపీ వెంకటేష్, వినోద్ కుమార్, ప్రదీప్ గౌడ్, జి. మధుసూదన్ రెడ్డి, అనిత జహీర్, అక్తర్ పాల్గొన్నారు.