Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
త్రిపురలో ముస్లిం మైనార్టీల ప్రార్థన స్థలాలు, షాపులు, నివాసాలపై మతోన్మాద మూకల దాడులను ఆవాజ్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి అబ్బాస్ ఆదివారం ఒక ప్రకటనలో ఖండించారు. గత పది రోజులుగా ఉత్తర త్రిపుర, గోమతి సాహిజల జిల్లాలలో 14 మసీద్లపై,అనేక షాపులపై , నివాసాలపై దాడులు జరుగుతున్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని నిలవరించటంలో అలసత్వం ప్రదర్శిస్తున్నాయని తెలిపారు. మతోన్మాద మూకలను కట్టడి చేసీ, మైనార్టీలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.
బంగ్లాదేశ్లో మైనార్టీలపై జరిగిన దాడులను సాకుగా చూపి దేశంలో వారిపై దాడులకు పాల్పడడం అత్యంత హేయమైన చర్య అని తెలిపారు. మతం పేరుతో ముస్లింలపౖౖె దాడులు చేసేవారి మతాల పేర్లు వేరైేనా.. ఉన్మాదం, ఉద్దేశం ఒకటేనని బంగ్లాదేశ్, త్రిపురలలో జరుగుతున్న దాడులను చూస్తే అర్థమవుతున్నదని పేర్కొన్నారు. బంగ్లాదేశ్ ఎన్నికల్లో లబ్ది పొందటానికి జమాతే ఇస్లామ్ అనే సంస్థ మతోన్మాద దాడులకు పాల్పడిందని తెలిపారు. త్రిపుర రాష్ట్రంలో నవంబర్ 25న జరిగే 20 మున్సిపాలిటీలలో ఎన్నికల లబ్ది పొందేందుకు మత హింసకు బీజేపీ పాల్పడుతున్నదని గుర్తుచేశారు. నాలుగేండ్ల పాలనా కాలంలో రాష్ట్రాన్ని అభివద్ధి చేయలేక చతికిలబడిన బీజేపీ ప్రభుత్వం, త్రిపుర గిరిజన అటానమస్ కౌన్సిల్ ఎన్నికల్లో ఇటీవల ఘోర పరాజయాన్ని చవిచూసిందని తెలిపారు. తిరిగి 20 మున్సిపాలిటీలలో జరిగే ఎన్నికల్లో ఓడిపోయే అవకాశం ఉందనే ఉద్దేశంతో ఇలాంటి దాడులకు పాల్పడుతున్నదని పేర్కొన్నారు. ప్రజలలో మతవిద్వేషాలు రెచ్చగొట్టి, భావోద్వేగాల ఆధారంగా ఓట్లు పొంది మున్సిపల్ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నదని తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసం మతోన్మాదులు ఆడుతున్న నాటకాన్ని ప్రజలు, ప్రజాస్వామికవాదులు అర్థం చేసుకోవాలని కోరారు.