Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నవంబర్ 12న కలెక్టరేట్ల ముట్టడి
- ఎన్పీఆర్డీ పిలుపు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల బంధు పథకాన్ని ప్రవేశపెట్టాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక(ఎన్పీఆర్డీ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి కురునెల్లి వెంకట్, ఏం అడివయ్య ఆదివారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దళిత బంధు పథకంలో వికలాంగులకు 25 శాతం అదనంగా చెల్లించాలని కోరారు. ఈ మేరకు వాటి సాధనకోసం నవంబర్ 12న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయాల ముట్టడి నిర్వహించనున్నట్టు హైదరాబాద్లోని రాష్ట్ర కార్యాలయంలో ఆ సంఘం రాష్ట్ర కమిటి సమావేశం అర్ వెంకటేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు తీర్మానాలు చేసినట్టు తెలిపారు. వికలాంగుల సాధికారత సమగ్రాభివృద్ధి కోసం వికలాంగుల బంధు పథకాన్ని ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. బంధు పథకం సాధనకోసం నవంబర్ 1 నుంచి 12 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార క్యాంపెయిన్ నిర్వహించనున్నట్టు తెలిపారు. గ్రామాల్లో సభలు నిర్వహించి, ఆయా కార్యాలయాల దగ్గర ధర్నాలు చేయనున్నట్టు తెలిపారు. సమాజంలో వికలాంగులు అత్యంత వెనుకబడిన ఉన్నారనీ, వారి సంక్షేమం కోసం ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టాలని వారు కోరారు. దళిత బంధు పథకంలో లబ్ధిదారుల ఎంపికలో అర్హులైన వికలాంగులకు మొదటిగాఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. పోలీస్ ఉద్యోగ నియామకాల్లో వికలాంగులకు రిజ్వేషన్లు అమలు చేయకూడదని కేంద్రం గజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిందనీ, దాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 2018 నుంచి పెండింగులో ఉన్న ఆసరా పింఛన్లు వెంటనే మంజూరు చేయాలనీ, 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టాన్ని ప్రభుత్వ శాఖలన్నీ పటిష్టంగా అమలు చేయాలని కోరారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులను గుర్తించి భర్తీ కోసం ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేయాలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేస్తున్న ఉద్యోగ నియామకాల్లో నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లల్లో ఐదు శాతం, ప్రభుత్వం మోడల్ మార్కెట్లలో షాపుల కేటాయింపుల్లో 5 శాతం, కేటాయించాలనీ కోరారు. ఉపాధి హామీ పథకంలో వికలాంగుల జాబ్ కార్డు ఇచ్చి 150 రోజులు పని దినాలు కల్పించాలనీ, ప్రభుత్వ కార్యాలయాలన్నీ అవరోధ రహితంగా మార్చాలని డిమాండ్ చేశారు. ప్రతి నెల సదరం క్యాంపు నిర్వహించాలని తెలిపారు. 21రకాల వైకల్యాల ప్రకారం వైకాల్య ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పి కవిత, అరిఫా, సహాయ కార్యదర్శులు వనం ఉపేందర్, కే కవిత, జే దశరథ్, రాష్ట్ర కమిటీ సభ్యులు శశికళ, బాలయ్య కాశప్ప, స్వామి, ప్రకాష్, వెంకట్ రెడ్డి, చంద్రమోహన్, షాహిన్ బేగం, మల్లేష్, సావిత్రి, లలిత, దుర్గా తదితరులు పాల్గొన్నారు.