Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్నిక నిర్వర్తించడంలో కలెక్టర్, సీపీ విఫలం
- మాజీ మంత్రి ఈటల రాజేందర్
నవతెలంగాణ-హుజురాబాద్
హుజరాబాద్ ఉప ఎన్నికతో సీఎం కేసీఆర్ ప్రజా విశ్వాసాన్ని కోల్పోయారని మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలు ఓటు వేసిన తర్వాత ఆ బాక్సులను మాయం చేయడం దుర్మార్గమని ఆరోపించారు. హుజురాబాద్లో ఆరు నెలలుగా అధికార పార్టీ ఆగడాలను నిలువరించడంలో కలెక్టర్, సీపీలు ఉదాసీనంగా వ్యవహరించారని ఆరోపించారు. ఇప్పుడు ఏకంగా ఈవీఎం ప్యాడ్లు మార్చారని ఆరోపించారు. హుజూరాబాద్ నుంచి కరీంనగర్కి గంట లోపల బస్లు చేరుకోవాల్సి ఉండగా 12 గంటలవరకు కూడా చేరలేదన్నారు. ఈవీఎం మార్చినట్టు వస్తున్న వార్తలపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ అంశంపై బీజేపీ రాష్ట్ర, ఢిల్లీ స్థాయిలో కూడా ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తున్నామని తెలిపారు. చట్ట పరిధిలో కాకుండా సీఎం ఆదేశాల మేరకు చట్టవ్యతిరేకంగా పనిచేసే అధికారులపై చర్యలు తీసుకునే వరకు ఊరుకోమని హెచ్చరించారు. ఇది మామూలు ఎన్నిక కాదనీ, ఇంత ఉత్కంఠభరితంగా జరిగిన ఎన్నికల్లో ఇంత నిర్లక్ష్యమా.. అని ప్రశ్నించారు. ఇలాంటి చర్యలు ద్రోహ పూరితం, నీచమైనవని అన్నారు. అంతేకాదు, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాత సీఎం దళితబంధు జీఓ ఇవ్వడం పెద్ద ఉల్లంఘనే అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యే, నాయకులు ఇక్కడ తిష్ట వేసి దళిత బంధు రాదనీ, పెన్షన్ రాదనీ ప్రజలను రకరకాలుగా బెదిరించారని ఆరోపించారు. దేశచరిత్రలో ఇలాంటి ఎన్నికలు ఎప్పటికీ రాకపోవచ్చన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే పద్దతిలో అధికార పార్టీ వ్యవహరించిందన్నారు. ఈ సమావేశంలో తుల ఉమ, బీజేపీ జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి, సంపత్ రావు తదితరులు పాల్గొన్నారు.