Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రంగారెడ్డి జిల్లా నూతన కమిటీ ఎన్నిక
- జిల్లా కార్యదర్శిగా కాడిగల్ల భాస్కర్ ఎన్నిక
- హాజరైన రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో రెండు రోజులుగా నిర్వహించిన సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా తొమ్మిదవ మహాసభలు విజయవంతంగా ముగిశాయి. హాజరైన ప్రతినిధులు ఇప్పటివరకు జరిగిన ఉద్యమాలు, ఆందోళన కార్యక్రమాలు సమీక్షిస్తూ భవిష్యత్ కార్యాచరణకు పునాదులు వేశారు. ఈ సందర్భంగా నూతన జిల్లా కమిటీని సభ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. రంగారెడ్డి జిల్లా కార్యదర్శిగా కాడిగల్ల భాస్కర్ ఎన్నికయ్యారు. మొత్తం 24 మంది జిల్లా కమిటీ సభ్యులతో ఏకగ్రీవంగా ఆమోదం తెలుపగా, 23 మంది సభ్యులను ఎన్నుకున్నారు. కార్యదర్శి వర్గ సభ్యులుగా 9మందిని ఎన్నుకున్నారు. పగడాల యాదయ్య, మధుసూదన్ రెడ్డి, సామెల్, శోభన్, చంద్రమోహన్, జగదీశ్, రాజు, కవిత ఉన్నారు. ఈ మహాసభలను మొదటి రోజు రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రారంభ ఉపన్యాసం చేసి శనివారం ప్రారంభించగా, ముగింపు సైతం భవిష్యత్తు ప్రణాళికలు ప్రకటిస్తూ నూతన కమిటీని పరిచయం చేశారు. రెండు రోజులుగా సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి. వెంకట్ పర్యవేక్షకులుగా వ్యవహరించి మార్గదర్శనం చేశారు. మహాసభలో తొలి రోజు జిల్లా కార్యదర్శి ప్రవేశపెట్టిన నివేదికపై హాజరైన ప్రతినిధులు సమగ్రంగా చర్చించి సూచనలు, సలహాలు చేశారు.