Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టాలి
- కార్మిక హక్కుల కోసం పోరాడుతాం: ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శి విజయలక్ష్మి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలు, అణచివేతలు తీవ్రమయ్యాయనీ, నేడు కార్మిక వర్గం ముందు పెను సవాళ్లు ఉన్నాయని ఏఐటీయూ జాతీయ కార్యదర్శి బివి విజయలక్ష్మి అన్నారు. ఆ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు రావాల్సిన ఆవశ్యకత ఉందని నొక్కిచెప్పారు. కార్మిక హక్కుల సాధన కోసం ఏఐటీయూసీ పోరాడుతున్నదన్నారు. ఆదివారం హైదరాబాద్లోని హిమాయత్ నగర్ గల సత్యనారాయణ రెడ్డి భవన్ వద్ద ఏఐటీయూసీ 102 వ వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె అరుణపతాకాన్ని ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ.. అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న కార్మిక హక్కులను నేడు కేంద్రం లోని నిరంకుశ మోడీ ప్రభుత్వం లేబర్ కోడ్లను తీసుకొచ్చి కాలరాస్తున్నదని విమర్శించారు. ముందుగా కార్మిక వ్యతిరేక చట్టాలు తీసుకురావడం, ఆ తరువాత వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ, ప్రయివేటీకరణ, జాతీయ ఆస్తుల మానిటైజేషన్, ప్రభుత్వ రంగ సంస్థల వ్యూహాత్మక విక్రయం వెనుక పెద్ద కుట్ర ఉందని వివరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమకు కోట్లలో విరాళాలిచ్చే కొన్ని కార్పొరేట్ సంస్థల లబ్ది కోసమే ఇలా చేస్తున్నదని విమర్శించారు. ఉద్యోగ, సామజిక భద్రతనిచ్చే ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తే ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలే ఉండవన్నారు. కార్పొరేట్ సంస్థలలో పని చేస్తే కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతారనీ, సమాన పనికి సమాన వేతనం దొరికే అవకాశమే ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక చట్టాల క్రోడీకరణ, నల్ల వ్యవసాయ చట్టాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, సహజ వనరుల విక్రయం వంటి ప్రజా వ్యతరేక విధానాలకు వ్యతరేకంగా, ప్రజల ప్రజాస్వామ్య హక్కులపై దాడులకు నిరసనగా పెద్దఎత్తున ఉద్యమాలు చేయాల్సిన అవసరముందన్నారు. రైతులు, ఉద్యోగులు, కార్మికులు, విద్యార్థులు, యువత సంఘటితమై బలమైన పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ శ్రామిక మహిళా ఫోరమ్ కన్వీనర్ ప్రేమ్ పావని, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎం. నరసింహ, నగర కోశాధికారి బొడ్డుపల్లి కిషన్, తదితరులు పాల్గొన్నారు.