Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కన్నతల్లి లాంటి ఊరిని విడిచాం.. నేడు గూడు కోసం ఎదురుచూస్తున్నాం
- మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ కోసం మా బతుకులు ఆగం జేసిండ్రు..
- పిల్లలకు చదువు లేదు.. పెద్దలకు ఉపాధి దొరకదు
- ఆర్అండ్ఆర్ కాలనీలో నేటికీ పూర్తికాని ఇండ్ల నిర్మాణం
- లక్ష్మాపూర్ నిర్వాసితుల ఆవేదన
నవతెలంగాణ-తొగుట
''ప్రాజెక్ట్ల నిర్మాణంతో బీడు వారిన భూములు సస్యశ్యామలం అవుతాయి.. రైతన్నకు నీటి ఎద్దడి కష్టాలు తీరుతాయి. ప్రతి ఎకరాకు సాగు నీరు అందుతుంది.. కాబట్టి మీరు పెద్ద మనస్సుతో భూములను ప్రాజెక్ట్ల నిర్మాణానికి ఇవ్వండి' అంటూ అధికారులు మా భూములను తీసుకున్నారు.. ఆ భూములకు నష్టపరిహారంతో పాటు ఇండ్లు కోల్పోయిన మాకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా కట్టిస్తామని నమ్మబలికారు. మేము ఊరు ఖాళీ చేసి ఇప్పటికి ఏడాదిన్నర దాటింది.. ఆయినా ఆర్అండ్ఆర్ కాలనీల్లో మా అందరికి పూర్తి స్థాయిలో ఇండ్లు పూర్తి కాలేదు. కన్నతల్లిలాంటి ఊరును విడిచాం.. ఇప్పుడు ఉండటానికి గూడు కోసం ఎదురుచూస్తున్నాం'' అంటూ మల్లన్నసాగర్ ముంపు గ్రామమైన లక్ష్మాపూర్ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం నత్తనడకన సాగుతున్నదని వాపోతున్నారు.
రాష్ట్రంలోనే గొప్పగా పేరొందిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ను ఐదేండ్ల కిందట ప్రభుత్వం ప్రారంభించింది. ప్రాజెక్ట్కు సంబంధించిన 24 కిలోమీటర్ల కట్ట నిర్మాణం కోసం కొండపాక మండలంలోని ఎర్రవల్లి గ్రామం సమీపం నుంచి తొగుట మండలంలోని తుక్కాపూర్ సమీపంలో గల పంపుహౌజ్ వరకు యుద్ధప్రాతిపదికన నిర్మాణ పనులు ప్రారంభించారు. దాంతో రెండు మండలాల్లోని 8 గ్రామ పంచాయతీలు, 6 మదిర గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ఈ క్రమంలో ప్రాజెక్టు కట్ట నిర్మాణానికి మధ్యలో ఉన్న లక్ష్మాపూర్ గ్రామాన్ని ఖాళీ చేయాలని గ్రామస్తులపై అధికారులు ఒత్తిడి తీసుకువచ్చారు. గ్రామాన్ని ఖాళీ చేసిన వెంటనే.. అన్ని పరిహారాలు ఇస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో నిర్వాసితులు 2020 మార్చి నెలలో గ్రామాన్ని ఖాళీ చేశారు. వీరిని తాత్కాలికంగా ఉంచేందుకు గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాల్టీలోని సంగాపూర్ గ్రామంలో అప్పటికే నిర్మాణం పూర్తి చేసిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించారు. అయితే కట్ట నిర్మాణం పూర్తి అయి ప్రాజెక్ట్లో నీటిని కూడా నిల్వ చేస్తున్నారు. అయినప్పటికీ ఆర్అండ్ఆర్ కాలనీ నిర్మాణం మాత్రం ఇంకా పూర్తి కాలేదు. నిర్వాసితుల కోసం 165 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అవసరం కాగా 102 ఇండ్ల నిర్మాణం పూర్తయింది. మిగిలిన 63 ఇండ్ల నిర్మాణం నత్తనడకన సాగుతున్నది. అలాగే 218 లే అవుట్ ప్లాట్లు అవసరముండగా.. స్థలాన్ని చదును చేసి సీసీ రోడ్లు వేశారు గానీ.. ప్లాట్లు కేటాయించలేదు. నెంబరింగ్ ఇచ్చి ప్లాట్లు కేటాయిస్తే.. తాము ఇండ్లు నిర్మించుకుంటామని నిర్వాసితులు వాపోతున్నారు.
కాలనీలో అన్నీ సమస్యలే..
నిర్మాణంలో ఉన్న ఆర్అండ్ఆర్ కాలనీకి దారి సరిగ్గా లేక స్థానికులు అవస్థలు పడుతున్నారు. కెనాల్ గట్టు దారి నుంచి వెళ్లేవారు.. ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు ప్రమాదాల బారిన సైతం పడ్డారు. మిషన్ భగీరథ నీరు అందించేందుకు ఏర్పాటు చేస్తున్న నీళ్ల ట్యాంకు, పైపులైన్ నిర్మాణం ఇప్పటికీ పూర్తి కాలేదు. గ్రామానికి కొద్ది దూరంలో రెండు బోరుబావులున్నాయి. వాటికి ఒకసారి స్టాటర్, మరొక బోరు బావిది కేబుల్ వైర్ను దొంగలు ఎత్తుకెళ్లారు. దాంతో తాగునీటికి ఇబ్బంది ఏర్పడింది. పూర్తి స్థాయి పరిహారాల కోసం 18 నెలలు నుంచి వేచి చూస్తున్నా.. ఫలితం లేకుండా పోయిందని నిర్వాసితులు కన్నీటిపర్యంతమయ్యారు.
260 మందికి ఇద్దరే టీచర్లు..
కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్న విద్యావ్యవస్థ సైతం నిర్వాసితుల పిల్లలకు అందని ద్రాక్షగానే మిగిలింది. సంగాపూర్లోని పాఠశాలలో ఇంతకుముందు 25 మంది విద్యార్థులకు ఇద్దరు టీచర్లు ఉండేవారు. అయితే ఆర్అండ్ఆర్ కాలనీ లక్ష్మాపూర్, ఏటీగడ్డ కిష్టాపూర్, వేములఘాట్, తుర్క బంజేరుపల్లి, మోగిల్చెరువు తాండా గ్రామాల విద్యార్థులు సైతం సంగాపూర్ పాఠశాలలో చేరడంతో ఈ సంఖ్య 260కి పెరిగింది. వీరందరికీ ఇద్దరే ఉపాధ్యాయులు ఉండటంతో పాటు సౌకర్యాల లేమితో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ప్రధానోపాధ్యాయులు శ్యామల తెలిపారు. తొగుట మండలం ఎంపీడీవో కొన్ని పుస్తకాలు పంపించడంతో.. విద్యార్థులకు ఒక బుక్ మాత్రమే ఇచ్చామన్నారు. ఇంతమంది విద్యార్థులకు 7నుంచి 9 మంది ఉపాధ్యాయులు ఉండాలన్నారు. మూట్రాజ్పల్లి మధిర గ్రామం లింగరాజ్ పేట పాఠశాలలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇక్కడ పాఠశాలలో ఒక ఒక టీచర్ 30 మంది విద్యార్థులతో పాఠశాల కొనసాగుతుండేది. ఆర్అండ్ఆర్ కాలనీ పల్లెపహాడ్, తాండా, దస్తగిరి నగర్ విద్యార్థులు ఇక్కడికి రావడంతో పాఠశాల సంఖ్య 137కి చేరడంతో సమస్యగా ఉందని ప్రధానోపాధ్యాయులు శ్రావణి తెలిపారు. నిర్వాసిత గ్రామాల్లో 22 మంది ఎస్జీటీ ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ.. నిర్వాసిత గ్రామాల విద్యార్థులకు విద్యాబోధన కరువైంది. కాగా, నేటి నుంచి పాఠశాలలకు ఆరుగురు టీచర్లు రానున్నట్టు తొగుట మండల విద్యాధికారి యాదవరెడ్డి తెలిపారు.