Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్సీ, ఎస్టీ చట్టానికి అవమానం : కేవీపీఎస్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీజేపీ ఎంపీ అరవింద్వి అహంకార పూరిత వ్యాఖ్యలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జాన్ వెస్లీ, టి స్కైలాబ్బాబు ఆదివారం ఒక ప్రకటనలో ఖండించారు. ఓ ఎలక్ట్రానిక్ మీడియాతో మాట్లాడుతూ తనకు అన్ని కేసులు అయిపోయాయనీ, కేవలం ఒక ఎస్సీ, ఎస్టీ కేసు మిగిలిందనీ, దాంతో ఏమవుతుంది లొట్టపీసు అంటూ వ్యాఖ్యానించటమంటే.. చట్టాన్ని అవమానించటమేనని పేర్కొన్నారు. తక్షణమే సదరు ఎంపీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన ఎంపీ పార్లమెంట్ చేసిన చట్టాన్ని కించపర్చడం వారి అవివేకానికి నిదర్శనమని తెలిపారు. దళిత గిరిజనుల రక్షణ కవచమైన ఈ చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం రద్దు చేయడానికి కుట్రలు చేసినప్పుడు సంఘటితంగా తిప్పికొట్టామని గుర్తు చేశారు. బీజేపీ దళిత గిరిజనుల ఓట్లు కావాలి కానీ వారికి చట్టాలు ఉండొద్దా ?అని ప్రశ్నించారు. తక్షణమే దళిత గిరిజన సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ హక్కులు, చట్టాలను గౌరవించని అరవింద్ తక్షణమే ఎంపీ పదవికి రాజీనామా చేయాలని కోరారు.