Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యావాలంటీర్లను ఏర్పాటు చేయాలి :ఎమ్మెల్సీ ఎ. నర్సిరెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో అవసరమున్న చోట విద్యావాలంటీర్లను నియమించాలనీ, పారిశుధ్య నిర్వహణ కోసం స్కావెంజర్లను, సిబ్బందిని నియమించాలని రాష్ట్ర్ర ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ, తెలంగాణ పౌరస్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షులు అలుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. ఆ వేదిక రాష్ట్ర స్థాయి సమావేశం ఆన్లైన్లో జరిగింది. సెప్టెంబర్ ఒకటో తేదీ నుండి పాఠశాలలు మొదలయిన తర్వాత పరిస్థితిపై వివిధ జిల్లాలలో క్షేత్ర స్థాయిలో వేదిక సభ్యులు నిర్వహించిన సర్వేపై చర్చించారు. స్కావెంజర్లు, స్వీపర్లు లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. కరోనా నేపథ్యంలో వారిని తొలగించడం దారుణమన్నారు. 60 శాతం పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులే ఉదయం తాళాలు తీయడం, సాయంత్రం వేయటం పనులు చేస్తున్నారన్నారు. పారిశుధ్య నిర్వహణను ప్రారంభంలో స్థానిక సంస్థలు కొంతమేరకు అమలు చేసినా..ప్రస్తుతం నామమాత్రంగానే జరుగుతున్నదని చెప్పారు. దీంతో పాఠశాలల పారిశుధ్యం సరిగా ఉండట్లేదనీ, దాని ప్రభావం పిల్లల ఆరోగ్యంపైన తీవ్రంగా పడుతున్నదని పేర్కొన్నారు. విద్యాశాఖ అధికారులు తక్షణమే ప్రతి పాఠశాలలో గతంలో మాదిరిగా స్కావెంజర్లను, ఇతర సిబ్బందిని నియమించాలని కోరారు. కరోనా అనంతరం ప్రయివేటు పాఠశాలల నుంచి పిల్లలు పెద్ద ఎత్తున ప్రభుత్వ పాఠశాల్లో చేరుతున్నారనీ, దీంతో గతంలో మూసేసిన పాఠశాలను తెరవాల్సిన పరిస్థితి వస్తున్నదని చెప్పారు. ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయులను సర్దుబాటు చేసినా కొరత చాలా ఉందనీ, ప్రభుత్వ పాఠశాలలకు వస్తున్న ఈ ఆదరణను నిలబెట్టుకునేందుకు తక్షణమే అవసరమున్న చోట కనీసం విద్యా వాలంటీర్లను నియమించాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.రాధేశ్యాం, కోశాధికారి ఎం. ఆంజనేయులు, ఉపాధ్యక్షులు శ్రీమతి కె.ఎ.మంగ, డాక్టర్ శారద, గంగాధర్ రెడ్డి, కార్యదర్శి కె. లక్ష్మణ్ రావులతో పాటు ఇతర రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.