Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెఫరెన్స్ ఉన్నవారికే ప్రిఫరెన్స్
- శస్త్రచికిత్సల కోసం రోజుల తరబడి సామాన్యుల ఎదురుచూపులు
- విసుగెత్తి వెనక్కి వెళుతున్న రోగులు
- పారదర్శకత లోపంతో తగ్గుతున్న విశ్వసనీయత
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అవి ప్రభుత్వాస్పత్రులు. ధర్మాస్పత్రులు. అక్కడ తరతమ బేధం లేకుండా అందరికీ సమాన వైద్యం అందాలి. ప్రజలందరి కోసం నెలకొల్పిన ఆ ఆస్పత్రులు ఇప్పటికే సౌకర్యాల లేమి, సిబ్బంది కొరతతో కునారిల్లుతున్నాయి. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ పథకాలుండటంతో కొంత మంది తప్ప మిగతా వారు శస్త్రచికిత్సలకు ప్రజలు ప్రయివేటు, కార్పొరేటు ఆస్పత్రులనే ఆశ్రయిస్తున్నారు. తమ వద్దకొచ్చే ఆ కొద్ది మందికి సైతం మెరుగైన, సంతృప్తికరమైన సేవలనందించడంలోనే సర్కారీ దవాఖానాలు విఫలమవుతున్నాయి. రాష్ట్రంలోని బోధనాస్పత్రులకు వాటి సామర్థ్యానికి మించి రోగుల తాకిడి నిత్యం ఉంటున్నది. పెరిగిన రోగుల సంఖ్యకు తగినట్టు వాటిల్లో సిబ్బందిని పెంచటం, విస్తరించటం ఎప్పటికప్పుడు చేపట్టకపోవటంతో నిత్యం రద్దీతో నిండిపోతున్నాయి. హైదరాబాద్ గాంధీ, ఉస్మానియా, వరంగల్ ఎంజీఎం ఆస్పత్రితో పాటు ఆయా జిల్లాల్లో ఉన్న బోధనాస్పత్రులన్నింటిలోనూ ఇదే పరిస్థితి. ఇక ఎవరి రెఫరెన్స్తోనైనా వస్తే వారికి వీఐపీల మాదిరిగా ముందుగా ట్రీట్మెంట్ అందిస్తూ సామాన్యుల శస్త్రచికిత్సలను మాత్రం రోజుల తరబడి వాయిదా వేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కోరనా వల్ల ప్రభుత్వాస్పత్రులపై ప్రజల్లో నమ్మకం పెరిగింది. గతం కన్నా 20 శాతం మంది ఎక్కువగా రావటమే ఇందుకు నిదర్శనం. 'రోగుల్లో పెరిగిన విశ్వాసాన్ని కాపాడుకుంటాం. ఇప్పటికే ఉన్న చిన్న, చిన్న లోపాలను సైతం సవరించుకుంటాం. పారదర్శకతకు పెద్ద పీట వేస్తాం. రిసెప్షన్ విధానాన్ని అమల్లోకి తెస్తాం. పెద్దాస్పత్రులకు వచ్చే వారికి ఇబ్బంది కలగకుండా ఆస్పత్రిలో ప్రవేశించగానే అవసరమైన సమాచారం అందించే ఏర్పాట్లు చేస్తాం'....అని పదే పదే ప్రభుత్వ పెద్దలు చెప్పినా పరిస్థితుల్లో మార్పు రావటం లేదు. పారదర్శకత లోపించటంతో పేద రోగులు తమను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయా శస్త్రచికిత్సల కోసం ఆపరేషన్ థియేటర్లలో రోజుల తరబడి ఉంచుతుండటంతో ఇన్ఫెక్షన్లు సోకి ఇతర రోగాల బారిన పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా సందర్భాల్లో ముందుగా ప్రభుత్వాస్పత్రులకు వచ్చిన రోగులు, ఇక వేచి చూసే ఓపిక లేక ప్రయివేటును ఆశ్రయిస్తున్నారు.
ప్రభుత్వాస్పత్రి నుంచి ప్రయివేటుకు వలస
ప్రభుత్వ బోధనాస్పత్రులకు గుండె తదితర సంక్లిష్ట శస్త్రచికిత్సల కోసం వచ్చే రోగులు....వారాల తరబడి ఎదురు చూడాల్సి రావటంతో వారు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు. దీంతో ప్రభుత్వాస్పత్రికి వచ్చిన రోగి కార్పొరేటు ఆస్పత్రుల వైపునకు వెళ్లాల్సిన అనివార్య పరిస్థితి. ఈ పరిస్థితిలో మార్పు తీసుకొచ్చేందుకు వీలుగా ఏండ్ల తరబడి వైద్యనిపుణులు ఇస్తున్న పారదర్శకమైన, కచ్చితమైన సమాచారాన్ని రోగికి ఇవ్వాలన్న సూచన అమలు కావటం లేదు.దీంతో రోగులకు ఇబ్బంది కలిగినపుడు వారి బంధువులు అందుబాటులో ఉన్న సిబ్బందిపై దాడులకు తెగబడుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ విషయమై తప్పు ఒకరిది...శిక్ష మరొకరికి అన్న చందంగా బంధువుల వైఖరి ఉంటున్నది. ప్రజలకు మెరుగైన సేవలందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. అందుకోసం సరిపడిన సిబ్బందిని, అవసరమైన సౌకర్యాలను కల్పించాలి. అలా చేయకుండా సౌకర్యాలన్ని ఉన్నాయనే తప్పుడు ప్రచారంతో రోగులు ఆవేశం, కోపానికి పోయి తమపై దాడులు చేస్తున్నారని డాక్టర్ల, నర్సుల సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో రోజువారీగా ఆయా విభాగాల్లో సర్జరీలు చేయగలిగిన సామర్థ్యాన్ని ప్రభు త్వమే ప్రజలకు తెలపాలని కోరుతున్నారు. అలా చేస్తే ప్రజ లు మానసికంగా సిద్ధపడి తమకిష్టమైన ఆస్పత్రిని ఎంపిక చేసుకునే అవకాశముంటుందని అభిప్రాయపడుతున్నారు.