Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్కు లేఖ రాసి నిరుద్యోగి ఆత్మహత్య
నవతెలంగాణ-జైపూర్
'కేసీఆర్ సర్.. దయచేసి ఉద్యోగ నోటిఫికేషన్ వేయండి' అంటూ ఓ లేఖ రాసి ఓ నిరుద్యోగి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం బబ్బెరచెలక గ్రామంలో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆసంపల్లి మహేశ్(25) ఉపాధ్యాయ శిక్షణ కోర్సు పూర్తి చేసి ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నాడు. అటు నోటిఫికేషన్లు రాక.. ఉద్యోగం దొరక్క మనస్తాపానికి గురైయ్యాడు. దాంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణ యించుకొని తన బాధను సూసైడ్ నోట్లో వ్యక్తపరిచాడు. 'కన్న వారికి బరువుగా ఉండటం ఇష్టం లేదు. ఆత్మహత్య చేసుకోవడం తప్పే అని తెలిసినా తప్పట్లేదు. కుటుం బం కోసం నేను ఏమీ చేయలేని నిస్సహాయుడ్ని. 25 ఏండ్ల వయసులో అమ్మానాన్న లకు అండగా ఉండాల్సింది పోయి భారంగా మారడం ఇష్టం లేక ఆత్మహత్య చేసుకుంటున్నాను.' అని రాసి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. శనివారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన మహేశ్ ఆదివారం ఉదయం వెల్మపల్లి శివారులోని పత్తి చేనులో శవమై కన్పించాడు. తన మృతితోనైనా ఉద్యోగ నోటిఫికేషన్ వస్తుందని నమ్ముతూ సీఎం కేసీఆర్కు విజ్ఞప్తి చేసిన మహేశ్... 'ప్రత్యక్షంగా మీ కండ్ల ముందు లేకపోయినా నా మనసంతా మీ మీదే ఉంటుందని జాగ్రత్తగా ఉండాలి' అని తన తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. మద్యం బాగా తాగొద్దని తండ్రిని వేడుకుంటూ... అమ్మను, సోదరిని జాగ్రత్తగా చూసుకోవాలని లేఖలో కోరాడు. మహేశ్ రాసిన లేఖ చదివిన ప్రతి ఒక్కరూ కంటతడి పట్టారు.
ఆర్థిక ఒత్తిడుల కారణంగా మహేశ్ ఆత్మహత్య : తల్లిదండ్రులు
ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా తమ కుమారుడు మహేశ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని మహేశ్ తల్లిదండ్రులు ఆసంపల్లి వెంకటి, లక్ష్మి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. శనివారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన మహేశ్ తన సెల్ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆదివారం ఉదయం వెల్మపల్లి శివారులోని పత్తి చేనులో శవమై కన్పించగా మహేశ్ ఇంట్లో మరణ వాగ్మూలం లభించింది. ఉద్యోగ నోటిఫికేషన్ వేయాలంటూ సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని కోరడం ఇబ్బందిగా భావించిన అధికార పార్టీకి చెందిన నాయకులు వెంటనే రంగంలోకి దిగి మహేశ్ తల్లిదండ్రులను కలిసి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆర్థిక ఇబ్బందులంటూ పోలీసుల ఫిర్యాదులో తెలపాలని కోరారు. కాగా, చెన్నూర్ పట్టణంలోని 'వేదవర్షిణి' చిట్ఫండ్లో ఏజెంట్గా పనిచేసిన మహేశ్ స్థానికులు, బంధువులను చిట్ఫండ్లో సభ్యులుగా చేర్పించారనీ, సదరు చిట్ఫండ్ బోర్డు తిప్పేయడంతో సభ్యులందరూ డబ్బులివ్వాలని ఒత్తిడి తెస్తున్న క్రమంలో తమ కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తల్లిదండ్రులు పేర్కొనడం గమనార్హం.