Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇండిస్టీయల్ పార్కు పేరుతో గుంజుకునే కుట్ర
- నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలో
- పంటలు వేసినా బీడుగా ఉన్నాయంటూ నోటిఫికేషన్
- ప్రాణం పోయినా ఇవ్వబోమంటున్న రైతులు
- ఇప్పటికే రసాయనిక పరిశ్రమలతో అవస్థలు
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తుల తరపున వకాల్తా పుచ్చుకుని వ్యవహరిస్తు న్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. పేదల భూములకు ఎసరు పెట్టి, బలవంతంగా లాక్కుని పెట్టుబడిదారులకు అప్పగించే పనిలో నిమగమైంది. నేరుగా కార్పొరేట్ శక్తులు భూముల కోసం రైతుల దగ్గరకు వెళ్లలేని పరిస్థితుల్లో.. ప్రభుత్వమే వారి తరపున లాక్కుంటోంది. అందుకోసం దశాబ్దాలుగా సాగులో ఉన్న నల్లగొండ జిల్లా వెల్మినేడు రైతుల పట్టా భూములు.. ఖాళీగా ఉన్నాయంటూ నోటిఫికేషన్లో పేర్కొంది.
346 ఎకరాలకు నోటిఫికేషన్
నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెల్మినేడు గ్రామంలో జాతీయ రహదారి పక్కనే ఇండిస్టీయల్ పార్కు కోసం 346 ఎకరాల భూమి కోసం ప్రభుత్వం కలెక్టర్ పేరుతో ఈనెల 21న నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రామంలోని 18 సర్వే నెంబర్లలో 161మంది రైతులకు చెందిన 346 ఎకరాల భూములు అవస రమంటూ 28న గెజిట్ విడుదల చేసింది. కొంత భాగం గుట్టలు, బోళ్లు కూడా ఉన్నాయి. ప్రభుత్వం అసైన్డ్ భూమి అంటూ నోటిఫికేషన్ విడుదల చేసింది. కానీ నైజాం పాలన కంటే ముందు నుంచే ఈ భూములన్నీ పట్టా భూములుగా నమోదై ఉన్నాయి. మొదటి నుంచీ రైతులు పత్తి, వరి, కందులు ఇతర పంటలు సాగు చేస్తున్నారు. ఎప్పుడూ ఆ భూములు బీడుగా ఉన్న సందర్భం లేదు.
కార్పొరేట్ శక్తులకు అప్పగించే కుట్ర
వెల్మినేడు గ్రామ పంచాయతీ పరిధిలోనే పిట్టంపల్లికి వెళ్లే దారిలో ఇప్పటికే చాలా ఫార్మాటికల్ కంపెనీలు ఏర్పాటు చేశారు. వాటిలోని ఓ కంపెనీ యజమా నికి తన కంపెనీకి ఎదురుగానే ఉన్న రైతుల భూములపై కన్నుపడింది. అనుకు న్నదే తడవుగా తనకు సన్నిహితంగా ఉన్న ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లాడు. ఆ భూములను లాక్కోవాలని ప్రభుత్వం ద్వారా నోటిఫికేషన్ విడుదల
సాగు భూములపై సర్కారు కన్ను
చేయించినట్టు తెలుస్తోంది. రైతులకు నష్టపరిహారంగా ప్రభుత్వ ధర కంటే అధికంగా మూడురెట్లు చెల్లిస్తామని చెబుతున్నారు. అంటే ఎకరాకు సుమారు రూ.15 నుంచి 18 లక్షల వరకు చెల్లిస్తామంటున్నారు. కానీ గ్రామంలో మార్కెట్ ధర గజమే దాదాపు రూ.15వేల నుంచి 20వేల వరకు ఉంది. ఎకరం భూమి కోటి రూపాయాలు ఇచ్చినా దొరకడం లేదు. ఇలాంటి పరిస్థితిలో రైతులను భయపెట్టి భూములు తీసుకుని కార్పొరేట్ శక్తులకు అప్పగించాలని ప్రభుత్వం చూస్తోంది.
రసాయనిక కంపెనీలతో పెనుప్రమాదం
గ్రామంలో ఇప్పటికే సుమారు 12 ఫార్మాస్యూటికల్ కంపెనీలు ఏర్పాటు చేశారు. రసాయనిక కంపెనీలతో పెనుప్రమాదం పొంచి ఉంది. ప్రజలు రోగాలబారిన పడుతున్నారు. వాయు, జలకాలుష్యం పెరిగింది. అన్ని రకాల పంటలపై కాలుష్య ప్రభావం పడుతోంది. ఇప్పటికే ప్రతి ఒక్కరూ ఏడాదికి లక్షకు పైగా ఆరోగ్యం కోసం ఖర్చు చేస్తున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది ఇండ్లకు తాళం వేసి పట్నం వెళ్లిపోయారు. మరోవైపు ఇండిస్టియల్ పార్కు పేరుతో ప్రభుత్వం తీసుకుంటామంటున్న భూములపైనే పేదలు ఆధారపడి బతుకుతున్నారు.
మూడుతరాలుగా ఈ భూమే సర్వస్వంగా జీవిస్తున్నారు. అభివృద్ధి పేరుతో ప్రభుత్వం సాగు భూములను గుంజుకుంటే ఊరుకునేది లేదని గ్రామస్తులు తెగేసి చెబుతున్నారు. ఇప్పటికే రసాయన కంపెనీలతో అవస్థలు పడుతున్నామని, ఇప్పుడు మరో పరిశ్రమ అంటూ భూములు గుంజుకుంటామనడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఈ విషయంలో వెనక్కి తగ్గాలని డిమాండ్ చేస్తున్నారు.
మా భూముల్లో సాగు లేదా.. కనిపించడం లేదా?
రైతు కొరమోని రామచంద్రం
మా భూముల్లో సాగు లేదు.. పడావుగా ఉందని అధికారులు చెపుతున్నారట. కండ్లుంటేే ఇక్కడికి రండి చూపిస్తం.. కంపెనీల వాళ్లు ఇచ్చే కాసులకు కక్కుర్తి పడి సాగు చేయడం లేదని తప్పుడు నివేదికలు ఇస్తరా.. అయ్యా కలెక్టర్ మా ఊరికి వస్తే వాస్తవాలు చూపిస్తం. దళితులకు ఇస్తానన్న మూడెకరాల భూమి ఇచ్చేదిలేదు గానీ.. కంపెనీ యాజమానులతో కుమ్మక్కైన ప్రభుత్వం ఉన్న భూములను గుంజుకుంటుంది.
మా భూముల జోలికి వస్తే..
మూడు తరాలుగా సాగు చేస్తూ జీవనం సాగిస్తున్న మా భూములను లాక్కోవాలని చూస్తే వచ్చిన వాళ్లను చంపడమా.. మేము చావడమా ఏదో ఒకటి జరగాల్సిందే.. మా మంచి తనాన్ని బలహీనతగా తీసుకోవద్దు. ప్రభుత్వం వేసిన నోటిఫికేషన్ రద్దు చేయాలి.
- రైతు అంశల సత్యనారాయణ
అన్నం పెట్టే రైతన్నకు సున్నం పెట్టొద్దు
దేశానికి అన్నంపెట్టే రైతన్న నోట్లో సున్నం కొట్టొద్దు.. అన్నదాతల కండ్లల్లో నీళ్లొస్తే అందరికీ అరిష్టం. అందుకే రైతుల భూములు లాక్కునే పద్ధతికి స్వస్తి చెప్పాలి. రోగాల బారిన పడుతున్న మా గ్రామ ప్రజలను కాపాడాలి. లేకపోతే తిరుగుబాటు చేస్తాం.
- దేశబోయిన స్వరూప, ఎంపీటీసీ-వెల్మినేడు
సాగుకు యోగ్యంకాని భూముల్లో పరిశ్రమలు పెట్టాలి
ఇండిస్టీయల్ పార్కు పేరుతో పేదల భూములను లాక్కోవడం సరైంది కాదు. సాగుకు యోగ్యం కాని భూముల్లో వాటిని ఏర్పాటు చేస్తే నిరుద్యోగులకు ఉపాధి, ఆ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది. అలాగాకుండా పంటలు సాగుచేస్తున్న భూములను తీసుకోవడం సరికాదు. ఒకవేళ బలవంతంగా తీసుకోవాలని ప్రయత్నం చేస్తే పెద్దఎత్తున ఆందోళన తప్పదు.
- బొంతల చంద్రారెడ్డి, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు