Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశవ్యాప్తంగా అమలును నిలిపివేయాలి
- ఎస్టీఎఫ్ఐ నిరసన దినంలో టీఎస్యూటీఎఫ్ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అంతరాలను, డ్రాపౌట్స్ను పెంచేలా నూతన జాతీయ విద్యావిధానాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రూపొందించిందని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్యూటీఎఫ్) విమర్శించింది. దేశవ్యాప్తంగా నూతన విద్యావిధానం అమలును నిలిపివేయాలని డిమాండ్ చేసింది. పాఠశాలలు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోరుతూ దేశవ్యాప్త ప్రచార ఆందోళనల్లో భాగంగా స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్టీఎఫ్ఐ) కేంద్ర కమిటీ సోమవారం అఖిల భారత నిరసన దినంగా పాటించాలని ఇచ్చిన పిలుపులో భాగంగా టీఎస్యూటీఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించింది. జిల్లా కలెక్టర్ల ద్వారా రాష్ట్రపతికి వినతిపత్రాలు సమర్పించారు.
రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగిన నిరసన ప్రదర్శనలో ఎస్టీఎఫ్ఐ జాతీయ ఉపాధ్యక్షుడు, టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి మాట్లాడుతూ విద్యా కేంద్రీకరణ, కార్పొరేటీకరణ, కాషాయీకరణకు దోహదం చేసే జాతీయ విద్యావిధానం-2020 అమలును నిలిపివేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా పాఠశాలలో ప్రత్యక్ష బోధన ప్రారంభించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో భారీ సంఖ్యలో ఉన్న ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలనీ, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, పార్ట్ టైం, గెస్ట్ తదితర పేర్లతో ఉపాధ్యాయుల శ్రమదోపిడీని అరికట్టి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సూచించారు. కోవిడ్ తో మరణించిన ఉపాధ్యాయుల కుటుంబాలను ఆదుకోవాలనీ, సామాజిక భద్రతకు శాపంగా మారిన సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయివేటీకరణను ప్రోత్సహిస్తూ, ప్రభుత్వ విద్యారంగం, ఉపాధ్యాయుల సంక్షేమం పట్ల తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నాయని విమర్శించారు.
ఈ కారణంగా విద్యలో అంతరాలు పెరిగి పేద ప్రజలకు విద్య అందకుండా పోతుందని ఆవేదన వ్యక్తంచేశారు. పేద, మధ్యతరగతి వర్గాల నడ్డి విరిచే విధంగా పెట్రోలియం ఉత్పత్తుల ధరలు రోజు రోజుకు అడ్డూ, అదుపు లేకుండా పెరుగుతున్నాయని చెప్పారు. వాటి ప్రభావం నిత్యావసర వస్తువుల ధరలపై పడుతుందని అన్నారు. వెంటనే ఇంధన ధరలను తగ్గించాలని అన్నారు. పెట్టుబడి దారుల లాభార్జన సమాజ తిరోగమనానికి కారణమవుతుందన్నారు. వాటిని మేధావులు, ప్రజలు ముక్త ఖంఠంతో ఖండిచాలని కోరారు. నాగర్కర్నూల్లో టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కె జంగయ్య, ఖమ్మంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు దుర్గాభవాని, సూర్యాపేటలో రాములు, సంగారెడ్డిలో లక్ష్మారెడ్డి, ఆఫీసు బేరర్లు, జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల ఆధ్వర్యంలో వివిధ జిల్లాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి.