Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి
- జిల్లా కలెక్టర్లకు మంత్రి గంగుల ఆదేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పంట కోతలు పూర్తయిన ప్రాంతాల్లో అవసరమైనచోట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఇదే అంశంపై హైదరాబాద్లోని తన కార్యాలయంలో సోమవారం మంత్రి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయని తెలిపారు. గన్నీల అందుబాటు, రవాణా ఏర్పాట్లు, అకాల వర్షాల నుంచి ధాన్యం తడవకుండా టార్పాలిన్లను సిద్ధం చేయటంపై మంత్రి అధికారులకు అధేశాలు జారీ చేశారు. రాష్ట వ్యాప్తంగా ఇప్పటికే 1,033 కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయని చెప్పారు. ధాన్యానికి సరిపడా గన్నీలు అందుబాటులో ఉన్నాయనీ, రైతులు ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదని చెప్పారు. కొనుగోళు పూర్తయిన తర్వాత తరలించడానికి రవాణా సదుపాయాలు కూడా పూర్తిగా సిద్దంగా ఉన్నాయని చెప్పారు. సమావేశంలో పౌరసరఫరాశాఖ కమిషనర్ అనిల్ కుమార్ పాల్గొన్నారు.