Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నిరుద్యోగుల ఆత్మహత్యలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నిరుద్యోగుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలనీ, ఉద్యోగాల భర్తీ కోసం వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని కోరారు. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వేయకుండా పూటకో ప్రకటనతో కాలయాపన చేస్తున్నదని విమర్శించారు. దీంతో రాష్ట్రంలోని నిరుద్యోగ యువత నిరాశ, నిస్పృహలకు గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నిరుద్యోగుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని తెలిపారు. యువత కోచింగ్ సెంటర్లలో వేలాది రూపాయలు ఖర్చు పెట్టి కోచింగ్ తీసుకుని నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తూన్నారని పేర్కొన్నారు.