Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పనుల్లో మరింత వేగం పెంచాలి
- సమీక్షలో మంత్రి వేముల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నిర్ణీత గడువులోగా అమరుల స్మారక చిహ్నం, కొత్త సచివాలయ నిర్మాణం జరగాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ఈ మేరకు సోమవారం తన కార్యాలయంలో ఆయా పనుల పురోగతిపై అధికారులు, వర్కింగ్ ఏజెన్సీలు, కన్సల్టెన్సీలు, ఆర్కిటెక్ట్లతో సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. వర్క్చార్ట్ ప్రకారం పనుల్లో మరింత వేగం పెంచాలని ఆదేశించారు. ఫ్లోర్ వైస్ అంతర్గత నిర్మాణాలు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా జరగాలని సూచించారు. అమరవీరుల స్మారక చిహ్నం మీద నిరంతరం జ్వలించే జ్వాలలో అమరుల త్యాగం ప్రతిబింబించే విధంగా ఉండాలన్నారు. ముఖద్వారం వద్ద ''తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం'' అని తెలుగులో ఉండాలనీ, ఆడియో-విజువల్ రూమ్లో సీటింగ్ వరుసల మధ్యలో కింద నుంచి మీదకు ఆరు ఇంచుల ఎత్తు ఉండేలా చూడాలని మంత్రి సూచించారు. అమరుల త్యాగాలను కండ్లకు కట్టినట్టు చూపించే ఫోటో ఎగ్జిబిషన్, ఒక కాన్ఫరెన్స్ హాల్, రెస్టారెంట్ ప్లాన్లను పరిశీలించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల ప్రకారం స్వల్ప మార్పులను మంత్రి సూచించారు. కొత్త సచివాలయ నిర్మాణ పనులపట్ల మంత్రి సంతప్తి వ్యక్తం చేశారు. ఇంకా వేగం పెంచాలన్నారు. అంతస్థుల వారీగా ప్రణాళికలను ఈ సందర్భంగా పరిశీలించారు. మంత్రులు, అధికారుల ఛాంబర్లు, డిపార్ట్మెంట్లవారీగా సెక్షన్ల ఛాంబర్ల అంతర్గత నిర్మాణాలపై కూలంకషంగా చర్చించారు స్వల్ప మార్పులతో తుది ప్రణాళికలను వీలైనంత త్వరగా సీఎంకు సమర్పించాలని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో ఆర్ అండ్ బీ కార్యదర్శి కె. శ్రీనివాసరాజు, ఇంజినీర్ ఇన్ చీఫ్ ఐ. గణపతిరెడ్డి, ఎస్.ఈలు పద్మనాభరావు, లింగారెడ్డి, సత్యనారాయణ, ఈ.ఈలు శశిధర్, నర్సింగరావు, వాస్తు నిపుణులు సుధాకర్ తేజ, ఆర్కిటెక్ట్ ఆస్కార్ పొన్ని, పలువురు కన్సల్టెన్సీ, వర్క్ ఏజన్సీ ప్రతినిధులు,అధికారులు పాల్గొన్నారు.