Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐక్యరాజ్యసమితి గుర్తించడం గర్వకారణం : మంత్రి సి.నిరంజన్రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ ఆహార సంస్థ ప్రపంచ విత్తన భాండాగారంగా తెలంగాణను గుర్తించడం మనందరికీ గర్వకారణమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థను, ఎండీ కేశవులును మంత్రి ప్రశంసించారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రోమ్ నగరంలో నవంబర్ 4, 5 తేదీల్లో విత్తన పరిశ్రమల సమగ్రాభివృద్ధిపై అంతర్జాతీయ విత్తన సదస్సు జరుగబోతున్నదని పేర్కొన్నారు. 195 ప్రపంచ దేశాలకు చెందిన వ్యవసాయ మంత్రులు, ప్రతినిధులు, విత్తన ప్రముఖులు, శాస్త్రవేత్తలు, విత్తన పరిశ్రమల ప్రతినిధులు అందులో పాల్గొంటారని తెలిపారు. 'భారతదేశ విజయగాథ..ప్రపంచ విత్తన భాండాగారంగా తెలంగాణ' అనే అంశంపై మాట్లాడేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆహ్వానం అందిందని పేర్కొన్నారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలంగాణ విత్తన సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కేశవులు మాట్లాడబోతున్నారని తెలిపారు. ఇది అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నామని పేర్కొన్నారు.
రాష్ట్రంలో నాణ్యమైన విత్తనోత్పత్తికి ఉన్న మౌలిక వసతులు, అవకాశాలు, విత్తన పరిశ్రమ సామర్థ్యం, ఆ రంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సీడ్ బౌల్ కార్యక్రమాలపై కేశవులు ప్రసంగిస్తారని తెలిపారు. రాష్ట్రం నుంచి మరిన్ని విత్తన ఎగుమతులు ప్రోత్సహిస్తామని తెలిపారు. ప్రపంచ విత్తన పటంలో తెలంగాణ అగ్ర భాగాన నిలవటానికి ఇది ఎంతగానో దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.