Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతి సభ్యునికి రూ.2 లక్షల ప్రమాద బీమా : రేవంత్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ డేటా అనటికల్ విభాగం ఆధ్వర్యంలో డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. హైదరాబాద్లోని గాంధీ భవన్లో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మనిక్కమ్ ఠాగూర్, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. ముందుగా రేవంత్రెడ్డితో పాటు సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క తదితర నాయకులు డిజిటల్ సభ్యత్వాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ, కాంగ్రెస్ కుటుంబంలో చేరిన వారికి రక్షణ ఉంటుందని తెలిపారు. పార్టీలో చేరిన ప్రతి సభ్యునికి రూ.2 లక్షల ప్రమాద బీమా వర్తిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో వరి వేస్తే ఉరి అన్నట్టుగా ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారని విమర్శించారు. నిరుద్యోగి మహేష్ ఆత్మహత్య చేసుకోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేసిన రేవంత్ అలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 30 లక్షల సభ్యత్వాన్ని చేయాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రగతిభవన్ ముట్టడి
నిరుద్యోగుల పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా యూత్ కాంగ్రెస్ సోమవారం ఆకస్మికంగా ప్రగతిభవన్ను ముట్టడించింది. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేనా రెడ్డి మాట్లాడుతూ మహేష్ది ఆత్మహత్య కాదీ, అది ప్రభుత్వ హత్యేనని విమర్శించారు. వెంటనే ఉద్యోగాల నోటిఫికేషన్లు వేయాలనీ, మహేష్ కుటుంబానికి రూ.50 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. పోలీసులు పలువురు నాయకులను అరెస్ట్ చేశారు.
వచ్చే ఎన్నికల్లో బీసీలకు 50 శాతం సీట్లు
వచ్చే ఎన్నికల్లో బీసీలకు 50 శాతం సీట్లు కేటాయిస్తామని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మెన్ మధుయాష్కీ తెలిపారు. గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లా నేతలు 119 నియోజకవర్గాల్లో పాదయాత్రలు చేస్తారని తెలిపారు. యూత్ కాంగ్రెస్ నాయకుల అరెస్టులను ఖండించారు. యువత ఆత్మహత్యలకు టీఆర్ఎస్ విధానాలే కారణమనీ, కేసీఆర్ను ప్రజాకోర్టులో శిక్షించాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి సమైక్య మాటలు ఆయన వ్యక్తిగతమని తెలిపారు. దొరల పాలనలో చాలామంది నక్సలైట్ ఉద్యమం వైపు వెళ్లారని తెలిపారు.