Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రంతో ఎమ్మెస్పీ ఇచ్చినా ఇవ్వకున్నా రాష్ట్రం ఇవ్వాలి
- తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ
నవతెలంగాణ-హిమాయత్నగర్
రాష్ట్రంలో వరి సాగు వద్దనడం దుర్మార్గమని, 'వరి సాగు చేస్తే ఉరే'నని సీఎం వ్యాఖ్యానించడం సరైంది కాదని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ అన్నారు. యాసంగిలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, ప్రత్యామ్నాయ పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సోమవారం హైదరాబాద్ బషీర్బాగ్లోని వ్యవసాయ శాఖ కమిషనర్ కమిషనరేట్ ఎదుట రైతులు పెద్దఎత్తు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మ మాట్లాడుతూ.. యాసంగిలో వరి వేయొద్దని ఒకరు, వేయాలని మరొకరు.. ఇలా మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు పూటకోమాట మాట్లాడుతూ రైతుల్ని గందోరగోళానికి గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరి సాగు, ధాన్యం కొనుగోళ్లపై టీఆర్ఎస్, బీజేపీ నేతలు దొంగ మాటలు, దొంగ దీక్షలు మానేసి వరి ధాన్యం కొనుగోలుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో వరి దిగుబడులు సాధించిన తెలంగాణ దేశంలోనే సరికొత్త రికార్డు సృష్టించిందన్నారు. చివరి గింజ వరకూ ధాన్యం కొంటామని చెప్పిన సీఎం కేసీఆర్ ఇప్పుడు వరి వద్దనడం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వం సూచించే పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించకుండా ప్రత్యామ్నాయ పంటలకు మళ్లాలని రైతులకు చెప్పడం అన్యాయం అన్నారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో బాయిల్డ్ రైస్కు డిమాండ్ తగ్గడం వల్ల తెలంగాణ రాష్ట్ర నుంచి వరి కొనుగోలు చేయబోమని కేంద్రం ప్రభుత్వం, ఎఫ్సీఐలు ప్రకటించడం సిగ్గుచేటన్నారు. ఎమ్మెస్పీకి గ్యారెంటీ ఉండటం, ప్రభుత్వం కొనుగోలు చేస్తుండటంతోనే రైతులు వరి సాగు ఎక్కువగా చేస్తున్నారన్నారు. విస్తీర్ణం అసాధారణంగా పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వం విదేశాలకు బియ్యం ఎగుమతులను ప్రోత్సహిస్తే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని చెప్పారు. ఇప్పటి వరకూ వరికి ప్రోత్సాహం ఇచ్చి, ఇప్పుడు వద్దంటూ నిరుత్సాహ పరిస్తే రైతులు తీవ్రంగా నష్టపోతారని అన్నారు. ప్రత్యామ్నాయ పంటల సాగుకు భూమిని తయారు చేసుకోవడానికి ఛత్తీస్గఢ్లో ఎకరాకు రూ.9 వేలు, హర్యానాలో రూ. 7 వేలు అక్కడి ప్రభుత్వాలు అందజేస్తున్నాయని గుర్తు చేశారు. తెలంగాణలో కూడా ఇతర పంటలకు మళ్లడానికి రైతులకు ఆర్థిక సహాయం అందజేయాలని కోరారు. రైతులను చైతన్యవంతం చేసి ప్రభుత్వం సూచించే ప్రత్యామ్నాయ పంటలకూ ఎమ్మెస్పీ గ్యారెంటీ ఇవ్వాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎమ్మెస్పీ ఇచ్చినా ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి, కొనుగోలు చేసి రైతులకు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ధర్నాలో రైతు సంఘం నేతలు కొల్లూరి రాజయ్య, ప్రభు లింగం, నెట్టం నారాయణ, రాజారామ్, వెంకట్రెడ్డి, విష్ణువర్ధన్రెడ్డి, నాని బుచ్చయ్య, వజ్రాల అరుణ, కొండారెడ్డి, సదానందరావు, విమలమ్మ తదితరులు పాల్గొన్నారు.