Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేట్కు ధీటుగా పేదలకు నాణ్యమైన విద్య
- ప్రగతి నగర్ ఎడ్యూకేషనల్ సొసైటీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
చాదస్తపు చదువు కాకుండా..శాస్త్రీయ ఆలోచనలు రేకిత్తించే విధంగా విద్యను అందించే ధృక్పథంతో 'ప్రగతి నగర్ ఎడ్యూకేషనల్ సొసైటీ' పేద విద్యార్థులకు మెరుగైన విద్యనందించడం అభినందనీయ మని ప్రముఖ విద్యావేత్త డాక్టర్ చుక్కారామయ్య అన్నారు. హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సోమవారం సొసైటీ కరస్పాండెంట్ డి దయాకర్రెడ్డి అధ్యక్షతన 'ప్రగతి ఐఐటీ-ఎన్ఈఈటీ అకాడమీ' బ్రోచర్ను ఆయన అవిష్కరించారు. అనంతరం రామయ్య మాట్లాడుతూ ఎలాంటి రాజకీయ లక్ష్యం లేకుండా సమాజ పురోగమన అభిప్రాయాలతో విద్యార్థులకు చదువును అందించాలనుకోవడం గొప్ప విషయమన్నారు. చదువు ఎవరికి దూరమవుతుంది? వారికి విద్యను ఎలా అందించాలన్న ఆలోచన నుంచి ప్రగతి ఎడ్యూకేషన్ సొసైటీ పుట్టిందని చెప్పారు. అందుకనుగుణంగా సెలక్షన్స్ నిర్వహించటం అభినందనీయ మన్నారు. ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ గత 28 ఏండ్లుగా భిన్నమైన మంచి ఆలోచనలతో పేద, మెరిట్ విద్యార్థులకు సరైన దిశా నిర్దేశంతో విద్యను అందించడం ప్రగతి సొసైటీకే చెల్లిందన్నారు. స్వతంత్రోద్యమ కాలంలో కూడా దేశభక్తియుత విద్యను అందించారని గుర్తుచేశారు. ఆ స్పూర్తితో ప్రగతి సొసైటీ పనిచేయడం ఓ ప్రత్యేకత అన్నారు. ప్రపంచీకరణ పుణ్యమాని విద్య వ్యాపారమయమయిందని చెప్పారు. ఒక మాటలో చెప్పాలంటే..ఇది తిరోగమన కాలమన్నారు. ఈ స్థితిలో దేశభక్తియుత విద్యను అందించటం గొప్ప విషయమని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రగతి నగర్ ఎడ్యూకేషనల్ సొసైటీ అధ్యక్షులు కె సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి పి చంద్రశేఖర్రెడ్డి, సభ్యులు సూర్యప్రకాశ్ పాల్గొన్నారు.