Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు తేలనున్న అభ్యర్థుల భవితవ్యం
- గెలుపు దీమాలో టీఆర్ఎస్, బీజేపీ
- డిపాజిట్ వచ్చేనా? : ఆందోళనలో కాంగ్రెస్
- విజయోత్సవాలపై ఎన్నికల కమిషన్ ఆంక్షలు
నవతెలంగాణ - కరీంనగర్
ప్రాంతీయ ప్రతినిధి / హుజూరాబాద్
ఈటల రాజేందర్ రాజీనామాతో ఐదు నెలలుగా సాగిన హుజూరాబాద్ ఉపఎన్నిక యుద్ధంలో గెలిచే ఆ 'బాద్షా' ఎవరో నేడు తేలనుంది. అక్టోబర్ 30న ఈవీఎంలలో ఓటరు భద్రపరించిన అభ్యర్థుల భవితవ్యం మంగళవారం మధ్యాహ్నానికల్లా భయటపడనుంది. ప్రధానంగా టీఆర్ఎస్, ఈటల రాజేందర్ మధ్యనే పోటీ నెలకొనగా.. డిపాజిట్ అయినా దక్కుతుందా? అన్న మీమాంసలో కాంగ్రెస్ పడింది. ఇప్పటికే ఓట్లలెక్కింపు ప్రక్రియకు సంబంధించిన సిబ్బందికి శిక్షణ పూర్తయింది. సుమారు వెయ్యి మంది పోలీసుల పహారాలో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ, పీజీ కళాశాలలో ఓట్ల లెక్కింపును నిర్వహించనున్నారు.
ఉదయం 8 గంటల నుంచే లెక్కింపు
మంగళవారం (నేడు) ఉదయం 8గంటల నుంచే ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేసిన ఐదు వివి ప్యాట్లలోని స్లిప్పులను కూడా లెక్కించనున్నారు. సిబ్బంది ఉదయం 6గంటలకే కౌంటింగ్ కేంద్రంలో రిపోర్టు చేయనున్నారు. మొదట పోస్టల్ బ్యాలెట్లు లెక్కించి అనంతరం బ్యాలెట్, కంట్రోల్ యూనిట్లను లెక్కించనున్నారు.కౌంటింగ్ సూపర్వైజర్లు, అసిస్టెంట్లు, పరిశీలకుల పర్యవేక్షణలో లెక్కింపు ప్రక్రియ సాగితే ఆ మొతాన్ని సూక్ష్మపరిశీలకులు పరిశీలించనున్నారు. ఆయా రాజకీయ పార్టీల ఏజెంట్లకు కూడా పాసులు జారీ చేశారు. కౌంటింగ్ కేంద్రంలో పాల్గొనే ప్రతి సిబ్బందికీ కొవిడ్ పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు అందజేశారు. సిబ్బంది ఎవరికీ సెల్ఫోన్ తీసుకొచ్చేందుకు అనుమతి లేదు. హుజూరాబాద్ ఉప ఎన్నిక బరిలో పోటీ చేసిన 30మంది ఫలితాలు తీసేందుకు ఏడు టేబుళ్ల చొప్పున 14కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేశారు. రెండు హాళ్లలో 7టేబుళ్ల చొప్పున నిర్వహించే లెక్కిం పును 22రౌండ్లలో పూర్తి చేయనున్నారు.
విజయోత్సవ ర్యాలీలకు అనుమతి రద్దు
కేంద్రం ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కొవిడ్ -19 నిబంధనలను అనుసరించి నేడు ఫలితం అనంతరం విజేత ర్యాలీలు తీసేందుకు, సంబురాలు చేసుకునేందుకు పోలీసుశాఖ అనుమతి రద్దు చేసింది. గెలిచిన అభ్యర్థితో పాటు సర్టిఫికెట్ తీసుకోవడం కోసం ఇద్దరు వ్యక్తులను మాత్రమే అనుమతి ఇస్తామని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో సాగేందుకు, ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ చోటుచేసుకోకుండా కౌంటింగ్ కేంద్రం వద్ద కరీంనగర్ సీపీ ఆధ్వర్యంలో ఇద్దరు అడిషనల్ డీసీపీలు, ఇద్దరు ఏసీపీలు, 14 మంది సీఐలు, 41మంది ఎస్ఐలు, 500 మంది పోలీసు, కేంద్ర, రాష్ట్ర సాయుధ బలగాలు మూడెంచల బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. ఐదునెలల ప్రచారహోరంతా పక్కకుపోయి చివరి రెండ్రోజుల్లో ఓటర్లను మలుపుతిప్పిన ఓటుకు నోటు ఎలాంటి ఫలితాన్ని తీసుకొస్తుందోనని రాజకీయ విశ్లేషకులూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.