Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తార్నాకలో 'ప్రయివేటు' లేదు :'నవతెలంగాణ'తో టీఎస్ఆర్టీసీ ఎమ్డీ వీసీ సజ్జనార్
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
టీఎస్ఆర్టీసీలోని 50వేల మంది కార్మికులు, ఉద్యోగులు తమ ఖాతాలను యూనియన్ బ్యాంక్లోకి మార్చుకోవాల్సిందేనని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు. ఈ నిర్ణయం తీసుకోవడానికంటే ముందు ప్రస్తుతం ఖాతాలు ఉన్న స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) అధికారులతో సంప్రదింపులు జరిపామనీ, తాము కోరిన ఆర్థిక సహకారాన్ని అందించేందుకు ఆ బ్యాంకు ముందుకు రాకపోవడంతో యూనియన్ బ్యాంక్ను సంప్రదించినట్టు చెప్పారు. సంస్థకు రూ.130 కోట్ల వరకు ఓవర్డ్రాఫ్ట్ (ఓడీ) సౌకర్యం ఇచ్చేందుకు యూనియన్ బ్యాంక్ అంగీకరించిందనీ, అయితే తాము అంత మొత్తాన్ని వాడుకోవట్లేదన్నారు. ఎప్పుడు ఎంత అవసరమైతే అంతే వాడుకొని, తిరిగి చెల్లింపులు చేస్తున్నామన్నారు. తార్నాక ఆర్టీసీ ఆస్పత్రిలో ఐసీయూ, ఎమర్జెన్సీ వార్డుల ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమం అనంతరం 'నవతెలంగాణ' ఆర్టీసీ ఎమ్డీతో పై అంశాన్ని ప్రస్తావించినప్పుడు ఆయన వివరణ ఇచ్చారు. ఎస్బీఐలో ఆర్టీసీ కార్మికులకు ఇప్పుడు ఖాతాలు ఉన్నాయనీ, ఆ బ్యాంకు ఇస్తున్న సౌకర్యాలకంటే అదనపు ప్రయోజనాలను కల్పిస్తామని యూనియన్ బ్యాంక్ హామీ ఇచ్చిందని వివరించారు. అందువల్లే ఎస్బీఐ నుంచి సంస్థ ఖాతాలతో పాటు కార్మికుల ఖాతాలను కూడా యూనియన్ బ్యాంక్కు మార్చుకోవాలని నిర్ణయించామన్నారు. ఆర్టీసీ వాణిజ్య సంస్థ అనీ, ఎక్కడ ఎక్కువ ఆర్థిక ప్రయోజనాలు లభిస్తే, అక్కడకు మారాల్సి ఉంటుందన్నారు. కార్మికుల ఖాతాల మార్పు అనేది క్రమేణా జరుగుతుందనీ, ఒకటో తేదీకి జీతాలు కావాలంటే ఖాతాను మార్చుకోకతప్పదని తేల్చిచెప్పారు.
తార్నాక ఆస్పత్రిలో ప్రయివేటుకు చోటు లేదు
తార్నాక ఆర్టీసీ ఆస్పత్రి నిర్వహణను ప్రయివేటు సంస్థలకు ఇవ్వలేదని టీఎస్ఆర్టీసీ ఎమ్డీ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు. పలు ప్రయివేటు, కార్పొరేట్ సంస్థలు సీఎస్ఆర్ ఫండ్స్ క్రింద ఆర్థిక, సాంకేతిక సహకారాన్ని అందించేందుకు ముందుకు వచ్చాయని వివరించారు.
ఆస్పత్రిలో సాంకేతిక నిర్వహణను మెడికవర్ హాస్పిటల్స్ సంస్థ చేపట్టిందనీ, మూడు నెలలపాటు ఆ సంస్థకు చెందిన నిపుణులు ఆర్టీసీ ఆస్పత్రి వైద్యులు, సిబ్బందికి శిక్షణ ఇచ్చి, వెళ్లిపోతారని చెప్పారు. ఆ తర్వాత పూర్తి నిర్వహణ ఆర్టీసీ ఆస్పత్రి యాజమాన్యానిదే ఉంటుందన్నారు. ఆస్పత్రిలో మౌలిక సౌకర్యాల కల్పన కోసం సీఎస్ఆర్ ఫండ్స్ ద్వారా లగట్టో హెల్త్ కేర్ సర్వీసెస్, డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్ (డీబీఎస్), స్వచ్ఛంద సంస్థ యునైటెడ్ వే ద్వారా ఆర్థిక సహకారాన్ని అందించినట్టు తెలిపారు. కార్పొరేట్ ఆస్పత్రి సేవలన్నీ ఇక్కడే లభించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కోవిడ్ టెస్టింగ్ సెంటర్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కోవిడ్ చికిత్స మాత్రం ఇక్కడ ఉండదనీ, గాంధీ లేదా ఇతర ఆస్పత్రులకు ఆ రోగుల్ని పంపుతామన్నారు. ప్రస్తుతం కోవిడ్ ఉధృతి తగ్గిందనీ, ఇక్కడ ఆ సేవల్ని ఏర్పాటు చేస్తే, ఇతర వైద్యసేవలకు అవాంతరాలు ఏర్పడతాయని వివరించారు.