Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్థన్
- ఐసీయూ, ఎమర్జెన్సీ వార్డులు ప్రారంభం
- మార్చి నాటికి అన్ని సేవలు అందుబాటులోకి... ఎమ్డీ వీసీ సజ్జనార్
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
తార్నాక ఆర్టీసీ ఆస్పత్రిని సూపర్ స్పెషాలిటీగా మారుస్తామని టీఎస్ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్థన్ అన్నారు. ఇకపై ఇక్కడి నుంచి ఇతర ప్రయివేటు, కార్పొరేట్ ఆస్పత్రులకు రిఫర్ చేయబోమనీ, అన్ని రకాల వైద్య సేవల్ని ఇక్కడే అందుబాటులోకి తెస్తామన్నారు. త్వరలో క్యాథ్ల్యాబ్ ఏర్పాటవుతుందన్నారు. ఏవైనా వైద్య సౌకర్యాల కొరత ఉంటే, వాటిని సాధ్యమైనంత త్వరలో ఇక్కడ కల్పిస్తామనీ, వచ్చే మార్చి నెలాఖరు నాటికి తార్నాక ఆస్పత్రి సూపర్ స్పెషాలిటీగా రూపాంతరం చెందుతుందని వివరించారు. సోమవారంనాడిక్కడి తార్నాక ఆర్టీసీ ఆస్పత్రిలో ఐసీయూ, ఎమర్జెన్సీ వార్డులను మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో చైర్మెన్ ముఖ్యఅతిధిగా పాల్గొని మాట్లాడారు. గతం ఓ పీడకల అనీ, ఇప్పుడు ఆర్టీసీకి మంచి రోజులు వచ్చాయని వ్యాఖ్యానించారు. ఆర్టీసీని ప్రయివేటు చేస్తారనీ, ఆస్తులు అమ్మేస్తారనే అనేక ఊహాగానాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ తెరదించారని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్టీసీని అమ్మకుండా, బతికించాలని ఆయన తనకూ, ఎమ్డీ సజ్జనార్కు స్పష్టం చేశారని తెలిపారు. ఏడున్నర ఎకరాల్లో సొంత భవనం, సౌకర్యాలతో ఉన్న తార్నాక ఆర్టీసీ ఆస్పత్రికి త్వరలో మహర్దశ వస్తుందన్నారు. అన్ని సౌకర్యాలు ఉన్నా ఈ కేంద్రాన్ని రిఫరల్ సెంటర్గా మార్చారనీ, దీనివల్ల ప్రయివేటు, కార్పొరేట్ ఆస్పత్రులకు రూ.40 కోట్లు బకాయి పడ్డామని వివరించారు. దీనిపై ఎమ్డీ సజ్జనార్ తనతో సంప్రదింపులు జరిపి, భవిష్యత్ ప్రణాళికను వివరించారన్నారు. ఒకేసారి కొన్ని వైద్య సౌకర్యాలు, పరికరాలు విరాళంగా తీసుకొని ఏర్పాటు చేసుకుంటే, భవిష్యత్లో ఇలా రూ.40 కోట్లు చెల్లించాల్సిన అవసరం ఆర్టీసీకి ఉండబోదన్నారు. మెడికేర్ హాస్పిటల్కు సాంకేతిక సౌకర్యాల కల్పనలో మంచి గుర్తింపు ఉన్నదనీ, నిజామాబాద్లో తాను ఆ ఆస్పత్రి సేవల్ని దగ్గరగా పరిశీలన చేశాననీ చెప్పారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) ఫండ్ ద్వారా విరాళాలు, సేవలు అందించిన సంస్థలకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఆర్టీసీకి ప్రభుత్వ సహకారం ఉంటుందనీ, అదే సందర్భంలో సంస్థ తనకాళ్లపై తాను ఆర్థికంగా నిలబడాలని ఆకాంక్షించారు. ప్రజలకు ఆర్టీసీపై నమ్మకం పెరుగుతున్నదని చెప్పారు. అన్ని డిపోల్లోని సంక్షేమ మండళ్ల సభ్యులు కార్మికుల సమస్యల్ని నిర్భయంగా డిపోమేనేజర్లు, రీజినల్ మేనేజర్ల దృష్టికి తీసుకెళ్లాలనీ, సాధ్యం కాదనుకుంటే తనకూ లేదా ఎమ్డీకి నేరుగా లేఖలు రాయాలని కోరారు. కార్మిక సమస్యల పరిష్కారంలో సంక్షేమ మండళ్ల సభ్యులు ధైర్యంగా వ్యవహరించాలనీ, వారిపై ఎలాంటి కక్షసాధింపు చర్యలు ఉండబోవన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రజారోగ్యశాఖ సంచాలకులు జి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రస్తుతం కోవిడ్ భయం పోయిందనీ, ప్రజలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయాలని విజ్ఞప్తి చేశారు. అన్ని సౌకర్యాలతో 200 పడకలు ఉన్న తార్నాక ఆర్టీసీ ఆస్పత్రి మరింత మెరుగైన వైద్యసేవలతో త్వరలో 400 పడకల ఆస్పత్రిగా మార్పు జరుగుతుందన్నారు. టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులకు యాజమాన్యం ఎప్పుడూ అండగా ఉంటుందనీ, వారే సంస్థకు ప్రధాన బలమని అన్నారు. సంస్థలో నష్టనివారణకు తొలుత ప్రాధాన్యత ఇస్తే, ఆదాయం పెరిగినట్టేనని స్పష్టం చేశారు. తార్నాక ఆర్టీసీ ఆస్పత్రిని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా మార్పు చేస్తామన్నారు. దీనికోసం అధికారులతో సమావేశమై ప్రణాళిక రూపొందించామని చెప్పారు. ఇప్పటికే డయాలిసిస్, రక్తనమూనా సేకరణ, ఫిజియోథెరఫీ యూనిట్లు, 24 గంటల ఫార్మా సెంటర్ను ప్రారంభించామన్నారు. తాజాగా 20 పడకలతో ఐసీయూ, ఎమర్జెన్సీ వార్డులను దాతల సహకారంతో ఏర్పాటు చేసుకున్నట్టు వివరించారు. ఈ సందర్భంగా ఆస్పత్రికి సీఎస్ఆర్ కింద నిధులు, సేవలు అందించిన లగట్టో హెల్త్కేర్ సర్వీసెస్, డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్ (డీబీఎస్), యునైటెడ్ వే, మెడికవర్ హాస్పిటల్స్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు పురుషోత్తం, వినోద్, వెంకటేశ్వర్లు, ఆర్థిక సలహాదారు రమేష్, తార్నాక ఆస్పత్రి సూపరింటెండెంట్ వెంకటరమణతో పాటు సీఎస్ఆర్ ద్వారా సహకారాన్ని అందించిన సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.