Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహారాష్ట్రకు తరలుతున్న ఆదిలాబాద్ పత్తి
- తేమతో సంబంధం లేకుండా క్వింటాల్కు రూ.8400
- ఆదిలాబాద్ మార్కెట్లో కనిపించని సందడి
- ఇక్కడి వ్యాపారులు తేమ పేరుతో దోచుకుంటున్నారని రైతుల ఆవేదన
నవతెలంగాణ- ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధి, బేల
పత్తికి ఎప్పుడు లేని విధంగా ఈసారి ధర రికార్డు స్థాయిలో ఉన్నా.. కొనుగోళ్లలో మాత్రం ఆదిలాబాద్లో వింత పరిస్థితి నెలకొంది. స్థానికంగా తేమ పేరుతో వ్యాపారులు రైతులను ఇబ్బందులు పెడుతుండటంతో పక్కనే ఉన్న మహారాష్ట్రకు రైతులు తమ పంటను తరలిస్తున్నారు. పొద్దున వెళ్లి సాయంత్రినికి అమ్ముకుని ఇండ్లకు చేరుతున్నారు.
ఆదిలాబాద్ మార్కెట్లో ప్రతిసారీ తేమ కారణంగా పత్తి కొనుగోళ్లపై ప్రతిష్టంభన నెలకొంటుంది. ఈసారి కూడా కొనుగోళ్ల ప్రారంభం రోజునే తేమ విషయంలో రైతులు రోడ్డెక్కారు. రైతులు, అధికారులు, వ్యాపారుల మధ్య నాలుగు గంటలపాటు చర్చ సాగింది. తేమతో సంబంధం లేకుండా కొనుగోలు చేయాలని రైతులు పట్టుబట్టగా.. ఇది లేకుండా కొనుగోలు చేసేది లేదంటూ వ్యాపారులు భీష్మించుకూర్చున్నారు. ఇరువురి మధ్య అధికార యంత్రాంగం ఎంతగా చర్చలు జరిపినా చివరికి అసంపూర్తిగానే మిగిలాయి. రైతుల ఆందోళనల నడుమ కొనుగోళ్లు ప్రారంభమైనా కొన్ని వాహనాలకే పరిమితమయ్యాయి. అప్పటికే పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలో తేమతో సంబంధం లేకుండా క్వింటాల్కు రూ.8వేలకు పైగా ధర చెల్లించి కొనుగోళ్లు జరుగుతున్నాయనేది రైతులకు చేరింది. దాంతో జిల్లా రైతులు సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న మార్కెట్లలో ఉన్న ధరల గురించి ఆరా తీస్తున్నారు. ఎక్కడ ఎక్కువ ధర ఉంటే అక్కడికి పత్తి వాహనాన్ని తీసుకెళ్లి విక్రయిస్తున్నారు. ప్రస్తుతం బేల మండలానికి సమీపంలో ఉన్న మహారాష్ట్రలోని కోర్పణ మార్కెట్లో క్వింటాల్కు రూ.8400 ఉండటంతో మండలంలోని రైతులు అక్కడికి వరుస కట్టారు. రోజువారీగా వందల సంఖ్యలో జిల్లాకు చెందిన పత్తి వాహనాలు పొరుగు రాష్ట్రానికి పయనమవుతున్నాయి. ఉదయం వెళ్లి సాయంత్రం వరకు తిరిగి వస్తున్నాయి.
తేమ పేచీతోనే నష్టం
తేమ పేచీ కారణంగానే రైతులు ఆదిలాబాద్ మార్కెట్కు ముఖం చాటేస్తున్నారు. జిల్లాతో పాటు మహారాష్ట్రలో మార్కెట్లోనూ క్వింటాల్ ధరలో ఏ మాత్రమూ వ్యత్యాసం లేదు. ఇక్కడికి కంటే అక్కడ రూ.100 లేదంటే రూ.200 వరకు మాత్రమే ఎక్కువగా ఉంది. ముఖ్యంగా రోజూ ఉదయం ఇక్కడి మార్కెట్లో ధర నిర్ణయించిన తర్వాతే అక్కడ కొంచెం ఎక్కువ చేసి కొనుగోలు చేస్తున్నారు. అక్కడి వ్యాపారులు ఆదిలాబాద్ మార్కెట్ను అనుసరిస్తున్నట్టు తెలుస్తోంది. దాంతో పాటు ఆదిలాబాద్లో వ్యాపారులు తేమను పరిగణనలోకి తీసుకుంటారు. ప్రస్తుతం శీతాకాలం కావడంతో పత్తిపై మంచు పడి సాధారణంగానే తేమ కొంత ఎక్కువగా ఉంటుంది. దాంతో ఆదిలాబాద్ మార్కెట్కు పత్తిలో తేమను పరిగణలోకి తీసుకుంటే.. రైతులు క్వింటాల్కు రూ.500 నుంచి రూ.800వరకు నష్టపోయే అవకాశం ఉంటుంది. ఒక్కో రైతు సుమారు 20క్వింటాళ్ల పత్తిని మార్కెట్కు తీసుకొస్తే క్వింటాల్కు రూ.500చొప్పున సుమారు రూ.10వేల వరకు తేమ కారణంగానే నష్టం జరిగే అవకాశం ఉంటుంది. దాంతో రూ.10వేల కంటే తక్కువ ధరతో.. కొంతమంది రైతులు కలిసి వాహనంలో పొరుగు రాష్ట్రానికి పత్తిని తీసుకెళ్లవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా ఆదిలాబాద్ మార్కెట్లో పత్తి వాహనాలు లేక సందడి కరువైంది.
గ్రామాల్లోనూ కొనుగోళ్లు
పత్తికి అంతర్జాతీయంగా డిమాండ్ ఉండటం కారణంగా చాలా మంది ఈ వ్యాపారం వైపు మొగ్గుచూపుతున్నారు. రెగ్యులర్ పత్తి వ్యాపారులే కాకుండా కొత్తగా అనేక మంది ఈ వ్యాపారంలోకి అడుగు పెడుతున్నారు. గతంలో ఇక్కడ పత్తిని కొనుగోలు చేయాలంటే నిబంధనలు అడ్డు ఉండేవి. కానీ ప్రస్తుతం అలాంటి నిబంధనలు లేకపోవడం, కొనుగోలు చేసిన పత్తిని దేశంలో ఎక్కడైనా విక్రయించే అవకాశం ఉండటంతో చాలా మంది ఈ వ్యాపారంపై ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన కొంత మంది వ్యాపారులు జిల్లాలోని వివిధ గ్రామాలకు పత్తి కొనుగోలు చేయడానికి వస్తున్నారు. కాంటాలతో వస్తూ ఆయా గ్రామాల్లో ఎక్కడికక్కడ రైతుల వద్దే కాంటా వేసి కొనుగోళ్లు చేస్తున్నారు. అక్కడికక్కడే డబ్బులు చెల్లిస్తున్నారు. దాంతో రైతుకు రవాణా ఖర్చు తప్పడంతోపాటు వెంటనే పైకం చేతికందుతోంది. ఇలా కొనుగోలు చేసిన పత్తిని వ్యాపారులు లారీల్లో వారి ప్రాంతానికి తరలిస్తున్నారు.
తేమతో సంబంధం లేకుండా విక్రయించాను
మహారాష్ట్రలోని కోర్పణ మార్కెట్లో తేమతో సంబంధం లేకుండా రూ.8400ధరతో 20క్వింటాళ్ల పత్తిని విక్రయించాను. పండించిన పంటకు గిట్టుబాటు ధర వచ్చిందని చాలా సంతోషంగా అనిపించింది. సొంతంగా వాహనం కూడా ఉండటంతో బేల మండలంలోని పలు గ్రామాల నుంచి రోజూ పత్తిని అక్కడికి తీసుకెళ్లి పూర్తి మార్కెట్ ధరతో పత్తిని విక్రయిస్తున్నాను. ఆదిలాబాద్లో తేమను చూడటం కారణంగానే అటువైపు వెళ్లడం లేదు.
- సుమిత్ ఠాక్రే, గూడ, బేల మండలం