Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధాన్యం కొనుగోళ్లతో రైతుల అగచాట్లు..
- కొనుగోలు చేసిన ధాన్యం వెనక్కు పంపిన రైస్మిల్లర్లు
- వడ్లు దహనం చేసి రెంజల్ రైతుల నిరసన
- తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ
- నేరేడుచర్లలో రైతుల రాస్తారోకో
నవతెలంగాణ - రెంజల్/నేరేడుచర్ల
అతివృష్టి, అనావృష్టి వాతావరణ పరిస్థితులను తట్టుకొని ఖరీఫ్లో చేతికొచ్చిన ధాన్యాన్ని అమ్మడానికి రైతులకు అగ చాట్లు తప్పడం లేదు. 10కిలోల తరుగు ఇస్తామన్నా ధాన్యం తీసుకోకుండా, తూకం వేసిన ధాన్యాన్ని మిల్లర్లు వెనక్కి పంపడంతో ఆగ్రహించిన నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం నీలా గ్రామ చౌరస్తాలో రైతులు వడ్లు తగలబెట్టి రాస్తారోకో చేపట్టారు. మరో ఘటనలో సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో అకాల వర్షానికి తడిచిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తూ రాస్తారోకో చేశారు.
నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం నీలా గ్రామానికి చెందిన రైతులు మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి 12 శాతం తేమతో కూడిన ధాన్యాన్ని పంపగా రైస్ మిల్లు యజమానులు నూక అవుతుందని వెనుకకు తిప్పి పంపారని తెలిపారు. ధాన్యం లోడింగ్ అన్లోడింగ్లకే డబ్బులు వెచ్చించాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత మండల, డివిజన్, జిల్లా స్థాయి అధికారులు పట్టించుకోకపోవడంతో రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వచ్చి హామీ ఇచ్చేంత వరకు ధర్నా, రాస్తారోకో విరమించే ప్రసక్తే లేదని రైతులు భీష్మించుకు కూర్చున్నారు. దాంతో స్థానిక ఎస్ఐ మురళి వారికి నచ్చజెప్పి తహసీల్దారుతో రైస్ మిల్లర్లతో మాట్లాడించి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇవ్వడంతో రైతులు రాస్తారోకో విరమించారు. కార్యక్రమంలో సద్దాం, ఎంఎల్ రాజు, షాబాజ్, శ్రీకాంత్, పవన్, ఎల్ గంగాధర్, రైతు కూలీ సంఘం నాయకులు నసీర్, జలీల్, ఆలీమ్ ఉద్దీన్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం చిల్లపల్లి గ్రామం వద్ద రైతులు.. మిర్యాలగూడ - నేరేడుచర్ల రహదారిపై సుమారు నాలుగు గంటల పాటు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ఆదివారం సాయంత్రం నుంచి పోలీసులు ధాన్యం ట్రాక్టర్లను మిల్లులకు అనుమతించకపోవడంతో తాము ధాన్యం లోడ్లతో మిల్లుల వద్ద పడిగాపులు కాస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి నుంచి అకాల వర్షాలు వచ్చి ట్రాక్టర్లలోని ధాన్యం పూర్తిగా తడిచి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తడిచిన ధాన్యానికి మిల్లర్లు మద్దతు ధర ఇవ్వడం లేదనీ, కొనుగోలు చేసేంత వరకూ కదిలేది లేదని భీష్మించారు. మండల వ్యవసాయాధికారి పి.వీరభద్రరావు, ఎస్ఐ విజరు ప్రకాష్ అక్కడికి వచ్చి రైతులను నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా రైతులు ససేమిరా అనడంతో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. మద్దతు ధర రూ.1800కు తక్కువ కాకుండా కొనుగోలు చేయిస్తామని వ్యవసాయాధికారి హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. కార్యక్రమంలో రైతులు సైదిరెడ్డి, లింగారెడ్డి, మల్లయ్య, నర్సిరెడ్డి, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.