Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యాసంగిలో వరి కొనేది లేదంటూ ప్రభుత్వ ప్రకటన దారుణం
- ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఆందోళనలు
- రాష్ట్రమంతా ఒకే నోటిఫికేషన్ ద్వారా పోడు దరఖాస్తులు స్వీకరించాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గం డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
యాసంగిలో వరిధాన్యం కొనుగోళ్లు చేయడం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గం తీవ్రంగా ఖండించింది. రైతులు పండించిన ప్రతి గింజనూ కొంటామంటూ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గతంలో వాగ్ధానం చేశారనీ, ఇప్పుడు ఒక్క గింజనూ కొనబోమని ప్రకటించడం దారుణమని విమర్శించింది. సోమవారం హైదరాబాద్లోని ఎంబీ భవన్లో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి వెంకట్ అధ్యక్షతన జరిగింది. అనంతరం తనను కలిసిన విలేకర్లతో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం లేఖ రాసింది కాబట్టి వరి ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం సరైంది కాదన్నారు. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించి పోరాడాలి తప్ప వెన్ను చూపడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. దీనిపై రైతాంగంలో వ్యతిరేకతను గమనించి రాష్ట్రంలో అరకొరగా కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ప్రారంభించిందని గుర్తు చేశారు. రైతాంగానికి సరిపోయినన్ని కేంద్రాలు ప్రారంభించలేదని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం తగినన్ని కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. యాసంగిలో వరిపంట వేయొద్దని నిర్ణయించడం దారుణమన్నారు. వరి మాత్రమే పండే మాగాణి భూములను ఏం చేయాలంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శీతల దేశాల నుంచి ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకోవాలనే ఒత్తిడికి మోడీ ప్రభుత్వం తలొగ్గి భారత్లో వరి ధాన్యం పండించకుండా ఆంక్షలు విధించిందని విమర్శించారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. పోడు భూముల సమస్యపై రాష్ట్రవ్యాప్తంగా అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో జరిగిన పోరాటాల ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించిందని చెప్పారు. ఏడేండ్లలో ఒక్క ఎకరాకూ పట్టా ఇవ్వని సీఎం కేసీఆర్ మెట్టు దిగినందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఈనెల 8 నుంచి పోడు సాగుదార్ల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తామని ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. అయితే రాష్ట్రమంతా ఒకే నోటిఫికేషన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించాలని డిమాండ్ చేశారు. జిల్లాల వారీగా దరఖాస్తులను స్వీకరించడం సరైంది కాదన్నారు. అటవీ భూములేవీ, సాగుభూములేవీ అనే దాని కోసం శాటిలైట్ ద్వారా కాకుండా వాస్తవ సాగుదార్ల ఆధారంగా భూ వివరాలను సేకరించాలని కోరారు. రిజర్వు ఫారెస్టులో ఉన్న గ్రామాలను బయటి ప్రాంతాలకు తరలించి వారికి అక్కడ భూమి ఇవ్వాలని అధికారులు ప్రతిపాదించడం అటవీ హక్కుల చట్టానికి విరుద్ధమని విమర్శించారు. రిజర్వు ఫారెస్టు అయినా, ప్రభుత్వ భూమి అయినా ఎక్కడ సాగు చేస్తే అక్కడే ఆ భూమికి పట్టా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అటవీ ప్రాంతంలో ఉన్నా గ్రామాలను తరలించే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు. అటవీ శాఖ ద్వారా సర్వే చేస్తున్నారనీ, ఇది సరైంది కాదని చెప్పారు. రెవెన్యూ శాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరించి సర్వే చేయాలని డిమాండ్ చేశారు. పోడు సాగుదార్లు ఎవరన్నది అటవీ శాఖ నివేదికల ఆధారంగా నిర్ణయించడానికి ప్రయత్నిస్తున్నారనీ, ఇది చట్ట విరుద్ధమని విమర్శించారు. దీనిపై గిరిజన గ్రామసభలకు నిర్ణయాధికారం ఉండాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే విడుదల చేసే మార్గదర్శకాల్లో ఈ విషయాలపై స్పష్టత ఇవ్వాలని కోరారు. లేదంటే పోడు భూముల కోసం సాగుదార్లు పోరుబాట పట్టక తప్పదని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా మండల, జిల్లా పార్టీ మహాసభలను సమీక్షించామన్నారు. జనవరి మూడోవారంలో జరిగే రాష్ట్ర మహాసభల సన్నాహాలను సమీక్షించి పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గం సంతృప్తి వ్యక్తం చేసిందని వివరించారు.