Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.వందతో రోజంతా ప్రయాణం
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
ప్రయాణీకుల్ని ఆకర్షించేందుకు టీఎస్ఆర్టీసీ మరో ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. కేంద్రప్రభుత్వం పెంచుతున్న పెట్రోల్, డీజిల్ ధరలనే తన ప్రచారాస్త్రంగా మార్చుకొని టీ-24 టిక్కెట్ను జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. లీటర్ పెట్రోల్ రేటుకంటే తక్కువ ధరకే రోజంతా (24 గంటలపాటు) హైదరాబాద్ సిటీ అంతా తిరిగేయండంటూ ప్రచారాన్ని మొదలుపెట్టారు. లీటర్ పెట్రోల్ ధర రూ.110 దాటిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ తీసుకొచ్చిన టీ-24 టిక్కెట్కు ప్రాధాన్యత ఏర్పడింది. వంద రూపాయలు పెట్టి టీ-24 టిక్కెట్ను కొనుగోలు చేసి, సిటీ ఆర్డినరీ, సబర్బన్, మెట్రో ఎక్స్ప్రెస్, మెట్రో డీలక్స్ సహా ఏ బస్సునైనా 24 గంటల్లో ఎన్నిసార్లైనా ఎక్కి దిగేయోచ్చు. ప్రతిబస్సులోనూ కండక్టర్ వద్ద ఈ టిక్కెట్లు లభిస్తాయి. దానిపై టిక్కెట్ తీసుకున్న సమయాన్ని రాస్తారు. అప్పటి నుంచి 24 గంటల పాటు ఏ బస్సులోనైనా ప్రయాణం చేయోచ్చు. ప్రస్తుతం పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరల నేపథ్యంలో ఈ ప్రయాణం సందర్శకులకు ఉపయోగకరంగానే ఉంటుంది. కాకపోతే సిటీలో బస్సుల సంఖ్య తగ్గిన దృష్ట్యా ఆయా రూట్లలో టైంకి బస్సులు దొరుకుతాయా లేదా అనేదే సందేహం. దీనిపై కూడా ఆర్టీసీ యాజమాన్యం దృష్టి పెడితే ప్రయాణీకులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఏదేమైనా ప్రయాణీకులు ఈ టిక్కెట్లను కొనుగోలు చేసి, ప్రయాణం చేయాలని టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.
బస్సులో ఊస్తే...
బస్సులు, బస్టేషన్లలో గుట్కా, ఖైనీ, పాన్మసాలా వంటివి నమిలి ఊస్తే, కఠిన శిక్షలు తప్పవని టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. ఇలాంటి చర్యలకు పాల్పడేవారు సంస్కారవంతులు కారనీ, దురలవాట్లను మానుకోవాలని హితవు పలికారు. ఈ పనులు వారికే కాకుండా, ఇతర ప్రజల ఆరోగ్యానికి ప్రమాదకరమనీ, పొగాకు నమిలే అలవాటు వల్ల రోజూ వందల మంది నోటిక్యాన్సర్తో మరణిస్తున్నారని తెలిపారు. బస్టేషన్లు, బస్సుల్లో ఉమ్మివేస్తే అలాంటి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని రీజినల్ మేనేజర్లు, డిపో మేనేజర్లకు ఆదేశాలు జారీ చేసినట్టు చెప్పారు.