Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రొఫెసర్ కోదండరాం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన ప్రతి నిరుద్యోగి ఆత్మహత్యకు కేసీఆర్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఒకరకంగా ఈ ఆత్మహత్యలను ప్రభుత్వం చేస్తున్న హత్యలుగానే భావించాలని టీజేఏస్ అధినేత కోదండరాం అన్నారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మలిదశ తెలంగాణ ఉద్యమ అమరుడు శ్రీకాంతాచారి వర్థంతి రోజైన డిసెంబరు మూడున యువజన, విద్యార్థి జన సమితిల ఆధ్వర్యంలో హైదరాబాదులో జరిగే ''తెలంగాణ యూత్ డిమాండ్స్ డే'' సదస్సు కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ''ఉద్యోగ నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ ఏడాది 21 మంది ప్రాణాలు కోల్పోయారు. అయినా కేసీఆర్ ప్రభుత్వం స్పందించటం లేదు. ఖాళీగా ఉన్న రెండు లక్షల పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, ప్రయివేటు రంగంలో యువకులకు ఉపాధి కల్పన, స్థానిక పరిశ్రమలలో స్థానికులకే ఉద్యోగాల కల్పన కోసం చట్టం చేయాలని కోరారు. ఇదే డిమాండ్పై టీజేఏస్ అనుబంధ విభాలైన యువజన, విద్యార్థి జన సమితిలు మరో పోరాటం చేయనున్నాయని వివరించారు. అందులో భాగంగా నిర్వహించే సదస్సులో పాల్గొనేందుకు యువత పెద్ద ఎత్తున తరలిరావాలి'' అని అన్నారు. ఈ కార్యక్రమంలో టీజేఏస్ రాష్ట్ర యూత్ అధ్యక్షుడు సయ్యద్ సలీంపాష, టీజేఏస్ రాష్ట్ర విద్యార్థి అధ్యక్షుడు బాబూ మహాజన్, టీజేఏస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపగాని శంకర్ రావు తదితరులు పాల్గొన్నారు.