Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హుజురాబాద్లో ఈటల గెలుపుతో టీఆర్ఎస్ పతనం ప్రారంభమైందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ అన్నారు. మంగళవారం హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఆత్మగౌరవం విజయం సాధించిందన్నారు. దళితబంధు పథకం లాంచ్ చేసిన గ్రామంలో బీజేపీ ఎక్కువ ఓట్లు వచ్చాయనీ, వేల కోట్ల పథకాలకు జీవోలు ఇచ్చినా ప్రజలు టీఆర్ఎస్ను నమ్మలేదని చెప్పారు. ప్రజల నమ్మకాన్ని కేసీఆర్ కుటుంబం కోల్పోయిందనీ, 6 వేల నుంచి 10 వేలు పెట్టి ఓట్లు కొన్నా లాభం లేకుండా పోయిందని విమర్శించారు. డబ్బులు పంచి ఓట్లు కొనాలనుకున్నా హుజూరాబాద్ ప్రజలు ఆత్మగౌరవం వైపే నిలబడ్డారనీ, ఆ ప్రజలకు నా సెల్యూట్ అని కొనియాడారు. ప్రజల తీర్పు చారిత్రాత్మకమైందనీ, ఒక కనువిప్పు అని చెప్పారు. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో బీజేపీ బలమైన శక్తిగా ఎదుగుతుందని స్పష్టం చేశారు.