Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 65 మంది విద్యార్థులకు మెడిసిన్ సీటు
- మంత్రి సత్యవతి రాథోడ్ అభినందనలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నీట్ ఫలితాల్లో గిరిజన సంక్షేమ శాఖ గురుకుల విద్యార్థులు తమ సత్తా చాటి 65 మంది విద్యార్థులు మెడిసిన్ సీటు సాధించడం పట్ల రాష్ట్ర గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మంగళవానం ఒక ప్రకటన ద్వారా అభినందనలు తెలిపారు. గతేడాది 35 మంది విద్యార్థులు మెడిసిన్ సీట్లు సాధిస్తే.... ఈ ఏడాది 65 మంది విద్యార్థులు సీట్లు పొందడం వారి కషి, పట్టుదలకు నిదర్శనమని పేర్కొన్నారు. ఇందుకు కషి చేసిన ఉపాధ్యాయులు, సిబ్బందిని మంత్రి అభినందించారు. ఇదే స్పూర్తిని కొనసాగిస్తూ వచ్చే ఏడాది వందమందికిపైగా మెడిసిన్ సీట్లు సాధించాలనే లక్ష్యంతో కష్టపడాలని సూచించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో అత్యధికంగా గురుకులాలు పెట్టి, నాణ్యమైన విద్యతో పాటు పోషకాహారాన్ని అందిస్తున్నామనీ, వాటి ఫలితాలు మనం ఇప్పుడు అనుభవించడం ఆనందంగా ఉందని తెలిపారు. గిరిజన విద్యార్థులు ఉన్నత విద్యలో రాణించేందుకు సీఎం చొరవ తీసుకోవటం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రతిభ కలిగిన విద్యార్థులను ప్రత్యేకంగా ప్రోత్సహించడంలో భాగంగా రాజేంద్రనగర్ స్టడీ సర్కిల్ లో ఆపరేషన్ ఎమరాల్డ్ పేరుతో ఇచ్చిన శిక్షణ సత్ఫలితాలు ఇవ్వడం పట్ల సంతోషాన్ని ప్రకటించారు. గతేడాది 447 మార్కులు అత్యధిక స్కోర్ సాధించగా...ఈ సంవత్సరం 563 మార్కులు పొంది గిరిజన విద్యార్థులు తమ సత్తా చాటారని తెలిపారు. బి. తరుణ్ అనే విద్యార్థి ఈ 563 మార్కులతో అగ్రస్థానం సాధించడం, మరో 23 మంది విద్యార్థులు 500 కు పైగా మార్కులు సాధించడం పట్ల అభినందనలు తెలిపారు.